AP Crime: అల్లూరి జిల్లాలోని అరకులోయలో విశాఖ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. కొర్రాయి పంచాయతీ బొందుగూడ గ్రామ సమీపంలో యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుడు విశాఖ కంచరపాలెం జయభారత్ నగర్కు చెందిన బంగారు చంద్రకాంత్ (17)గా నిర్ధారించారు. యువకున్ని దారుణంగా కొట్టి చంపినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. యువకుడి కాళ్లు చేతులు కట్టివేసి సమీపంలో కాలువలో పడేశారు నిందితులు. గత నెల 30న డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో యువకుడి తండ్రి ఫిర్యాదు చేశారు. స్నేహితులే చంపి ఉంటారని తండ్రి ఆరోపిస్తున్నారు.
Read Also: Vizag: విశాఖ రైలు ప్రమాదంపై విచారణ వేగవంతం
విశాఖ నుంచి గత నెల 30న నలుగురు స్నేహితులతో కలిసి చంద్రకాంత్ అరకు వెళ్లాడు. అక్కడ మరి కొంతమంది యువకులతో కలిసి పార్టీ చేసుకున్నట్టు సమాచారం.ఆ తర్వాత నుంచి చంద్రకాంత్ ఆచూకీ కనిపించలేదు. దారుణ హత్యకు గల కారణాలపై డుంబ్రిగూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. యువకుడి స్నేహితులను పిలిచి కేసును విచారిస్తున్నారు.