RCB women win WPL: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి సంచలనం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో వడోదర వేదికగా జరిగిన తుదిపోరులో సత్తా చాటింది. ఎలాంటి భయం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ మహిళల జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్ను సొంతం చేసుకుంది. మరోవైపు ఢిల్లీ మాత్రం నాలుగోసారి ఫైనల్ ఆడినా, ఈసారి కూడా ట్రోఫీ కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే.. ఈ విజయంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన పాత్ర అసాధారణం. ఆమె బ్యాట్ పట్టినప్పటి నుంచి మ్యాచ్ మీద ఆర్సీబీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. జార్జియా వాల్ సైతం అద్భుతంగా ఆడింది. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అదే ఆర్సీబీ విజయంలో కీలక మలుపుగా మారింది.
READ MORE: Astrology: ఫిబ్రవరి 6, శుక్రవారం దినఫలాలు..
అయితే.. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానకు ఇది మామూలు మ్యాచ్ కాదు..బ్రేకప్ తర్వాత స్ట్రాంగ్ కమ్బ్యాక్ అనే చెప్పాలి. ఇటీవల మహిళల వరల్డ్ కప్ 2025 గెలిచిన కొన్ని రోజులకే స్మృతి మంధాన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు రావాల్సి ఉంది. నవంబర్ 23 (ఆదివారం) నాడు పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ, పెళ్లి రోజున స్మృతి తండ్రి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ పరస్పర అంగీకారంతో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై అనేక పూకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేశాడని, వేరే అమ్మాయితో ఉన్నాడనే రూమర్స్ వచ్చాయి. ఈ అంశాలపై క్లారిటీ లేదు గానీ.. వీరి వివాహానికి మాత్రం అనూహ్యంగా బ్రేక్ పడింది.ఈ అంశంపై స్మృతి మంధాన సోషల్ మీడియాలో స్పందిస్తూ “గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ పర్సన్ని. పెళ్లి రద్దయిందని స్పష్టం చేస్తున్నాను. దయచేసి మా రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించండి” అని కోరింది. దేశం కోసం ఆడటమే తనకు ముఖ్యమని పేర్కొంది. తాను చెప్పిన విధంగానే తాజాగా ఆటలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. జట్టు విజయానికి కీలకంగా నిలిచింది.
READ MORE: WPL 2026 Final : విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. స్మృతి మంధాన ఊచకోత.!
కాగా.. వడోదరలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ జట్టుకు అండగా నిలిచింది. చక్కని షాట్లతో 37 బంతుల్లో 57 పరుగులు చేసింది. చివర్లో చినెల్ హెన్రీ కేవలం 15 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరును మరింత పెంచింది. ఓపెనర్లు లారా వోల్వార్ట్, లిజెల్ లీ కూడా వేగంగా ఆడింది. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్కు ఇది చాలా పెద్ద స్కోరే. అంత భారీ లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదని అందరూ భావించారు. కానీ ఆర్సీబీ బ్యాటర్లు మాత్రం వేరేలా ఆలోచించారు. తొలి ఓవర్లలో గ్రేస్ హారిస్ త్వరగా అవుట్ కావడంతో కాస్త ఒత్తిడి వచ్చింది. కానీ స్మృతి మంధాన, జార్జియా వాల్ ఆ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోలేదు. వరుసగా బౌండరీలు బాదుతూ.. రన్రేట్ను అదుపులో ఉంచారు. 10 ఓవర్లకు స్కోరు సరిగ్గా 100కి చేరింది. ఇంకా 10 ఓవర్లలో 104 పరుగులు కావాలి. ఈ దశలో మంధాన మరింత దూకుడు చూపించింది. స్నేహ్ రాణా ఓవర్లో బౌండరీతో కేవలం 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసింది. మరోవైపు వాల్ కూడా అదే జోరుతో పరుగులు చేసింది. 14 ఓవర్లకు స్కోరు 150కి చేరింది. అప్పటికి ఇంకా 36 బంతుల్లో 54 పరుగులే కావాలి. ఈ సమయంలో జార్జియా వాల్ అవుట్ కావడంతో ఢిల్లీకి కాస్త ఆశ చిగురించింది. కానీ ఆర్సీబీ బ్యాటర్లు కూల్గా ఆడుతూ చివరి వరకు ఒత్తిడిని తట్టుకున్నారు. చివరికి రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నారు. ఇది డబ్ల్యూపీఎల్ ఫైనల్స్లోనే కాదు, ఐపీఎల్ ఫైనల్స్లో కూడా ఇప్పటివరకు ఛేదించిన అత్యధిక లక్ష్యంగా నిలిచింది.