Bhole Baba: ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ జిల్లాలోని రతీఖాన్పూర్లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లో సత్సంగం ఏర్పాటు చేయగా.. కార్యక్రమం ముగుస్తుందనగా అందరూ ఒకేసారి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. దీనికి గల కారణంపై విచారణ జరుగుతోంది. ఆయన పటియాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లుగా చెప్పుకున్నాడు. 17 ఏళ్ల పాటు ఇందులో పని చేశాడు.
Read Also: Hathras Stampede: యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..
26 ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లు ఆయన చెప్పుకుంటాడు. తనకు గురువు కూడా ఎవరూ లేరని చెబుతుంటాడని స్థానికులు అంటుంటారు. సమాజం కోసం ఆధ్యాత్మిక బాట పట్టినట్లు చెబుతుంటాడట. తెల్లటి సూట్, టైతో ఆయన బోధనలు చేస్తుంటాడు. నేడు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో సహా భారతదేశం అంతటా అతనికి మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ముఖ్యంగా అనేక ఆధునిక మతపరమైన వ్యక్తుల మాదిరిగా కాకుండా, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఏ ప్లాట్ఫారమ్లోనూ అధికారిక ఖాతాలను కలిగి లేరు. అట్టడుగు స్థాయిలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కరోనా సమయంలోనూ ఈయన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేవారు.
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేలాది మంది హాజరవుతారు. ఈ సమావేశాల సమయంలో వాలంటీర్లు భక్తులకు ఆహారం, పానీయాలతో సహా అవసరమైన ఏర్పాట్లను నిర్ధారిస్తారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించడం కొనసాగించినందుకు భోలే బాబా దృష్టిని ఆకర్షించారు. ఆయన భార్యతో కలిసి సత్సంగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హాత్రాస్కు ముందు మంగళవారం మెయిన్పురి జిల్లాలో సత్సంగ్ నిర్వహించాడుయ 2022 కొవిడ్ గైడ్ లైన్స్ ఉన్న సమయంలో సత్సంగ్ కోసం ఫరూఖాబాద్ అధికారులను అనుమతి అడిగారు. 50 మందితో సత్సంగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పాడు. కానీ 50 వేల మంది రావడంతో అధికారులు తలపట్టుకున్నారు. హథ్రాస్లో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది.