యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన.. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్లో ఉండటానికి గల కారణాలేమిటని అడిగారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు ఎందుకు పనులు అప్పగించారని అడిగారు.
Moinabad Case: మొయినాబాద్ యువతి ఘటన.. ఎస్సైపై వేటు
యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్ఈఎల్తో జరిగిన నెగోషియెషన్స్, అంగ్రిమెంట్ విలువ వంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్ 6న బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్లో వర్క్ ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదు ? ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదు? అని భట్టి ప్రశ్నించారు. సకాలంలో తమకు బిల్లులను చెల్లించలేదని బీహెచ్ఈఎల్ అధికారులు ఆలస్యానికి కారణాలను వివరిస్తూ తెలిపారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఇబ్బందులు సైతం జాప్యానికి కారణమని తెలిపారు.
Sarkaaru Noukari : సింగర్ సునీత కొడుకు సినిమా.. అప్పుడే ఓటీటీ లో
రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్ఈఎల్కు అప్పగించిన పనులు విలువ ఎంత? అని మంత్రి ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్కు రూ. 20,444 కోట్లు విలువ చేసే పనులు అప్పగించారని, మిగిలిన పనులను జెన్కో ఇతర సంస్థలు చేపట్టాయని బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో రూ.15,860 కోట్ల పనులు పూర్తి చేయగా, రూ.14,400 కోట్ల చెల్లింపులు చేశారన్నారు. రూ.1167 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వం చెల్లింపులు విడతల వారీగా చేయలేదని, 2023 మార్చి ఒక్క నెలలోనే 91శాతం పేమెంట్ చేశారన్నారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో తాము సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేక పోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదని వివరించారు. పర్యావరణ అనుమతులను ఏప్రిల్ 2024 నాటికి తీసుకువస్తే తాము సెప్టెంబర్ 2024 వరకు రెండు యూనిట్లు, డిసెంబర్ 2024 వరకు మరో రెండు యూనిట్లు, 2024 మే నాటికి మిగిలిన ఒక యూనిట్ను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు తెలియజేశారు.