IND vs WI 3rd T20I: గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో భారత జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్ కూడా ఓటమిపాలైతే సిరీస్ చేజారినట్లే. వెస్టిండీస్లో టెస్టు, వన్డే సిరీస్లను గెలుచుకున్న భారత జట్టు టీ20 సిరీస్ను కూడా గెలుచుకోవాలంటే ఈ నిర్ణయాత్మక టీ20లో తప్పక గెలవాల్సిందే. గయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఓడితే రెండేళ్లగా కాపాడుకుంటూ వస్తున్న రికార్డు కూడా చేజారిపోతుంది. ఈ కీలక మ్యాచ్లో హార్ధిక్ సేన ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Breaking: సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి
మూడో టీ20లో భారత జట్టులో కీలక మార్పులు జరిగాయి. ఇషాన్ కిషన్ స్థానంలో యశస్వీ జైస్వాల్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రవి బిష్ణోయ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే విండీస్ గడ్డపై టెస్టుల్లోకి అడుగుపెట్టి యశస్వి జైస్వాల్ అరంగేట్ర మ్యాచ్లోనే శతకంతో చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్ల్లో అదే జోరును కొనసాగించాడు. మరి టీ20లలో ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సిందే.రెండు మ్యాచ్లను గెలిచి సిరీస్ దక్కించుకోవాలన్న ఊపులో ఉన్న వెస్టిండీస్ టీమ్లో కూడా జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ ఛేజ్ బరిలోకి వచ్చాడు.
వరుసగా రెండు మ్యాచ్లలో టీమిండియా పరాజయం పాలు కాగా.. ఓపెనర్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. తిలక్ వర్మ ఒక్కడే మెరుగ్గా ఆడి భారత్ పరువు నిలిపాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో రాణిస్తున్నా బ్యాటింగ్లో మాత్రం తన మ్యాజిక్ను చూపడం లేదు. ఎన్నో విమర్శల పాలవుతున్న హార్ధిక్ సేన ఈ మ్యాచ్లోనైనా సత్తా చాటుతుందా?
తుది జట్లు :
ఇండియా : శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్ : కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, షిమ్రన్ హెట్మెయర్, రొవ్మన్ పావెల్ (కెప్టెన్),రోస్టన్ ఛేజ్, రొమారియా షెపర్డ్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్