Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..

Bengal

Bengal

Bengal Election Results Live Updates: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు, మే 4న రాష్ట్రంలోని 294 స్థానాలకు (ఫల్తా మినహా 293 స్థానాలకు) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, ఆమెపై బీజేపీ తరపున సువేందు అధికారి, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ ప్రసాద్, సీపీఎం నుంచి శ్రీజీబ్ బిస్వాస్ పోటీ పడుతున్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్‌డెట్స్‌ మీకోసం..

The liveblog has ended.
  • 04 May 2026 06:38 PM (IST)

    నందిగ్రామ్‌లో సువేందు అధికారి విజయం

    నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి భారీ విజయం సాధించారు. 10, 200 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరో స్థానం భవానీపూర్‌లో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బీజేపీ 205 స్థానాల్లో భారీ విజయంగా దూసుకెళ్తోంది.

  • 04 May 2026 06:21 PM (IST)

    బెంగాల్ విజయంపై ప్రధాని మోడీ కీలక ట్వీట్

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ డబుల్ సెంచరీ దాటుకుని భారీ విజయం దిశగా వెళ్తోంది. ప్రస్తుతం 205 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇక ఈ గెలుపుపై ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘బెంగాల్‌లో కమలం వికసించింది. ఇది ప్రజల విజయం. బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం.’’ అని ప్రధాని మోడీ ప్రశంసించారు.

  • 04 May 2026 06:17 PM (IST)

    నా కుమార్తె కమలాన్ని వికసింపజేసింది: రత్న దేబ్‌నాథ్

    తన కుమార్తె బెంగాల్ అంతటా కమలాన్ని వికసింపజేసిందని ఆర్జీకర్ బాధితురాలి తల్లి, పానిహాటి బీజేపీ అభ్యర్థి రత్న దేబ్‌నాథ్ అన్నారు. ప్రస్తుతం ఆమె 56,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థించారు. కోరినట్టుగానే ప్రజలు గట్టి మద్దతు ఇచ్చారు.

  • 04 May 2026 06:11 PM (IST)

    పత్రాలు, ఫైళ్లు జాగ్రత్తగా ఉంచాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంతో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాల నుంచి ఎలాంటి ముఖ్యమైన పత్రాలు లేదా ఫైళ్లు మిస్ కాకుండా.. పాడవ్వకుండా.. ఎవరూ బయటకు తీసుకెళ్లకుండా చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులకు, కార్యాలయాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సచివాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.

     

  • 04 May 2026 05:47 PM (IST)

    డబుల్ సెంచరీ కొట్టిన కమలం

    పశ్చిమ బెంగాల్‌లో కమలం పార్టీ డబుల్ సెంచరీ కొట్టేసింది. 200 మార్కు దాటేసింది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 294 స్థానాలు ఉండగా.. మెజార్టీ మార్కు దాటుకుని భారీ విజయంగా దిశగా వెళ్తోంది. దీంతో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకుంటున్నారు. ఇక ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ, సీనియర్ నాయకులు రానున్నారు.

  • 04 May 2026 05:31 PM (IST)

    భారీ ఆధిక్యంలో ఆర్జీకర్ బాధితురాలి తల్లి

    కోల్‌కతా ఆర్జీకర్ బాధితురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్న దేబ్‌నాథ్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పానిహాటి నియోజకవర్గ అభ్యర్థిగా 56,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థించారు. కోరినట్టుగానే ప్రజలు గట్టి మద్దతు ఇచ్చారు.

  • 04 May 2026 05:26 PM (IST)

    ఆప్‌లాగా టీఎంసీ కూడా అంతమైపోయింది: దుబే

    ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గతే భవిష్యత్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు పట్టొచ్చని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అన్నారు. ‘‘శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్, భారతీయ జనతా పార్టీలను ఏ లక్ష్యంతో స్థాపించారో.. ఆ లక్ష్యాన్ని ప్రధానమంత్రి మోడీ పూర్తిగా అమలు చేశారు. ఆర్టికల్స్ 370, 35Aలను రద్దు చేసి.. బంగ్లాదేశీయుల నియంత్రణలో ఉన్న బెంగాల్‌కు విముక్తి కల్పించడమే మోడీ ఏకైక లక్ష్యం. టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరతారు. వారిని చేర్చుకోవాలా వద్దా అనేది బీజేపీ నిర్ణయిస్తుంది.’’ అని అన్నారు.

  • 04 May 2026 05:08 PM (IST)

    అసన్‌సోల్‌లో టీఎంసీ కార్యాలయానికి నిప్పు

    పశ్చిమ బెంగాల్‌లో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకోవైపు బీజేపీ శ్రేణులు దాడులకు దిగారు. అసన్‌సోల్‌లోని టీఎంసీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో మంటల్లో కాలిపోతుంది. ప్రస్తుతం డబుల్ సెంచరీ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం 199 స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉంది.

  • 04 May 2026 05:04 PM (IST)

    13వ రౌండ్‌లోనూ మమతనే ఆధిక్యం

    భవానీపూర్‌లో ప్రస్తుతం కౌంటింగ్ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువేందు అధికారి ఉన్నారు. 13వ రౌండ్ ముగిసే సమయానికి మమత 5,349 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే బీజేపీ ఏజెంట్లు తమను కౌంటింగ్ కేంద్రం నుంచి గెంటేశారని ఇరత ఏజెంట్లు ఆరోపించారు. గందరగోళం నెలకొనడంతో ప్రస్తుతం కౌంటింగ్ నిలిపివేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

  • 04 May 2026 04:36 PM (IST)

    భవానీపూర్‌లో కౌంటింగ్‌ నిలిపివేత

    భవానీపూర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువేందు అధికారి ఉన్నారు. 12వ రౌండ్ ముగిసే సమయానికి మమత 7,184 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్ ముగిసే సమయానికి కూడా మమతనే లీడ్‌లో ఉన్నారు. అయితే బీజేపీ ఏజెంట్లు తమను కౌంటింగ్ కేంద్రం నుంచి గెంటేశారని ఇరత ఏజెంట్లు ఆరోపించారు. ఇక మమతకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య ప్రస్తుతం కౌంటింగ్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

  • 04 May 2026 04:31 PM (IST)

    డబుల్ సెంచరీ దిశగా కమలం

    పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతుంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి కమలం పార్టీ తన సత్తాను చాటింది. మొత్తం 294 స్థానాలు ఉండగా.. డబుల్ సెంచరీ దిశగా వెళ్తోంది. ప్రస్తుతం 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

  • 04 May 2026 04:25 PM (IST)

    హౌరా గ్రౌండ్‌లో లాఠీఛార్జ్

    హౌరా గ్రౌండ్‌లో టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మమతకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు పాల్పడ్డారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 04 May 2026 04:08 PM (IST)

    భవానీపూర్‌ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    భవానీపూర్ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దీంతో బీజేపీ శ్రేణులు మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చక్కదిద్దుతున్నారు.

  • 04 May 2026 04:03 PM (IST)

    భవానీపూర్‌లో ఆధిక్యంలో మమత

    భవానీపూర్ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 12వ రౌండ్ ముగిసే సమయానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 7,184 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం 193 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు దాటేసింది.

  • 04 May 2026 03:57 PM (IST)

    2 చోట్ల ఆధిక్యంలో ఉన్న హుమాయన్ కబీర్

    ముర్షిదాబాద్‌‌లోని నౌడా, రెజినగర్ అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రెండు స్థానాల్లో కూడా ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్ ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 May 2026 03:47 PM (IST)

    కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్‌‌కు వచ్చిన మమత

    పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టింది. 294 స్థానాలకు గాను కమలం పార్టీ మెజారిటీ మార్కును దాటేసింది. ప్రస్తుతం 193 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్‌కు వచ్చారు.

  • 04 May 2026 03:42 PM (IST)

    బెంగాల్ సచివాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం

    పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం దిశగా కమలం పార్టీ దూసుకెళ్తోంది. మెజార్టీ మార్కు దాటేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నబన్నలోని పశ్చిమ బెంగాల్ సచివాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్పీఎఫ్‌ దళాలు భారీగా మోహరించారు.

  • 04 May 2026 03:29 PM (IST)

    మమత అక్రమాలను మోడీ, అమిత్ షా అడ్డుకున్నారు: కౌసర్ జహాన్

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం.. మోడీ సాధించిన విజయంగా ఢిల్లీ హజ్ కమిటీ అధ్యక్షురాలు కౌసర్ జహాన్ అభివర్ణించారు. ‘‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్రమ వలసదారుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.’’ అని అన్నారు.

  • 04 May 2026 03:22 PM (IST)

    రసగుల్లా, ఝల్‌మురిలతో సంబరాలు చేసుకున్న రేఖా గుప్తా

    పశ్చిమ బెంగాల్‌, అస్సాంలో బీజేపీ విజయంతో దేశమంతా ఆ పార్టీ శ్రేణులు, నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన సహచర కేబినెట్ మంత్రులతో సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీ సచివాలయంలో రేఖా గుప్తాకు రసగుల్లా, ఝల్‌మురిని మంత్రులు తినిపించారు.

     

  • 04 May 2026 03:08 PM (IST)

    ఇక బెంగాల్‌లో దాదాగిరి ఉండదు.. అభివృద్ధే ఉంటుంది: వినోద్ తావ్డే

    ఇకపై బెంగాల్‌లో దాదాగిరి పని చేయదని.. అభివృద్ధి మాత్రమే ఉంటుందని జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వినోద్ తావ్డే అన్నారు. సంవత్సరాలుగా బీజేపీ కార్యకర్తలు బలిదానం అయ్యారన్నారు. ఇకపై అభివృద్ధి రాజకీయాలు మాత్రమే వర్ధిల్లుతాయని తెలిపారు. ‘‘ఇక నుంచి బుజ్జగింపులు.. దాదాగిరి, దిదిగిరి పని చేయవు. కేవలం అభివృద్ధి మాత్రమే పని చేస్తుంది. దేశ భద్రతకు బెంగాల్‌లో విజయం అత్యవసరం. ఇప్పుడు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతాం.’’ అని అన్నారు.

  • 04 May 2026 02:55 PM (IST)

    ఇది బెంగాల్ విజయమే కాదు.. దేశానికే విజయం: శివరాజ్‌సింగ్ చౌహాన్

    పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి శివరాజ్‌‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం బెంగాల్ విజయమే కాదు.. భారతదేశానికే విజయం అని అన్నారు. ‘‘బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనేదే ఎప్పటి నుంచో ఉన్న కల. మోడీ నాయకత్వంలో ఆ చిరకాల ఆశ నెరవేరింది. అక్రమ చొరబాట్లు బెంగాల్‌ను నాశనం చేశాయి. బెంగాల్‌ అరాచకానికి టీఎంసీనే బాధ్యత వహించాలి.’’ అని వ్యాఖ్యానించారు.

  • 04 May 2026 02:13 PM (IST)

    బీజేపీ సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ సాధిస్తున్న ఘనవిజయం 'ఇండియా' (INDIA) కూటమి ఒక విఫల ప్రయోగమని నిరూపించిందని ఆమె విమర్శించారు. ఈ కూటమికి నిర్దిష్టమైన సిద్ధాంతం, నాయకత్వం లేదా ఐక్యత లేదని, కేవలం అధికారం కోసమే ఏర్పడిన అవకాశవాద కూటమి అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికల ప్రచార సమయంలో కూటమిని సమన్వయం చేయడంలో లేదా దిశానిర్దేశం చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని, అందుకే మిత్రపక్షాలన్నీ తలో దిక్కున చెల్లాచెదురయ్యాయని ఎద్దేవా చేశారు. బెంగాల్ ప్రజలు హింస, అరాచకం, బుజ్జగింపు రాజకీయాలను తిరస్కరించారని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని అభివృద్ధి, స్థిరత్వానికి పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు.

  • 04 May 2026 01:54 PM (IST)

    తృణమూల్ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. 2021 ఎన్నికల్లో బెంగాల్ రాజకీయాలను ఊపేసిన "ఖేలా హోబే" (ఆట మొదలైంది) పాట సృష్టికర్త, తృణమూల్ యువనేత దేబాంగ్షు భట్టాచార్య ఓటమి దిశగా సాగుతున్నారు. హుగ్లీ జిల్లాలోని చూచురా (Chuchura) నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్‌ను పక్కనపెట్టి, దేబాంగ్షును బరిలోకి దింపిన మమతా బెనర్జీ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుబీర్ నాగ్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. బెంగాల్ వ్యాప్తంగా తన పాటతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన దేబాంగ్షుకు, తన నియోజకవర్గంలో మాత్రం ఓటర్లు 'ఖేలా శేష్' (ఆట ముగిసింది) అని స్పష్టమైన తీర్పునిస్తున్నారు. కేవలం చూచురాలోనే కాకుండా, ప్రెసిడెన్సీ రీజియన్ అంతటా తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఒక గాయకుడిగా ప్రాచుర్యం పొందిన దేబాంగ్షును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చి గెలిపించాలనుకున్న టీఎంసీకి ఈ ఫలితం మింగుడుపడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 173 స్థానాల్లో ముందంజలో ఉండి అధికారం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, టీఎంసీ గుర్తింపుగా మారిన నినాద కర్తనే వెనుకబడి ఉండటం ఆ పార్టీ పతనానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

  • 04 May 2026 01:27 PM (IST)

    దీదీ ఇంటి వద్ద భారీ భద్రత..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకుపోతుండటంతో కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 173కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మెజారిటీ మార్కును దాటేయడంతో, ఆ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వెలుపల భారీగా మోహరించారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే కాళీఘాట్ ప్రాంతంలో బీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని "జై శ్రీరామ్" నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో 15 ఏళ్ల తృణమూల్ పాలనకు అంతం పాడుతూ, తమ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న ఉత్సాహంతో కార్యకర్తలు కాషాయ జెండాలు ఊపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు, మమతా బెనర్జీ నివాసం వద్ద ఉద్రిక్తత పెరగకుండా ఉండేందుకు కోల్‌కతా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ 17,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 100 లోపు స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.

  • 04 May 2026 01:23 PM (IST)

    అసన్సోల్‌లో ఉద్రిక్తతలు..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అసన్సోల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసన్సోల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వెలుపల ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు కేంద్రం వెలుపల ఉన్న కుర్చీలను విరగ్గొట్టడమే కాకుండా, అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. అసన్సోల్ ప్రాంతంలో ఈసారి పోరు చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అభ్యర్థిని అగ్నిమిత్ర పాల్ సుమారు 24,888 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 04 May 2026 01:18 PM (IST)

    17,371 ఓట్ల భారీ ఆధిక్యంలో మమతా బెనర్జీ..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్‌లో భవానీపూర్ (Bhabanipur) నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పట్టును నిరూపించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఏడవ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారిపై 17,371 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మెజారిటీ మార్కును దాటి 173 స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ, మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం స్పష్టమైన పైచేయి సాధిస్తున్నారు. ప్రారంభ రౌండ్లలో సువేందు అధికారి స్వల్ప ఆధిక్యం కనబరిచినప్పటికీ, రౌండ్లు పెరిగే కొద్దీ మమత తన మెజారిటీని గణనీయంగా పెంచుకుంటూ పోతున్నారు. ఈ స్థానంలో ఆమె విజయం దిశగా దూసుకుపోతుండటం టీఎంసీ శ్రేణులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించడంలో బీజేపీ ముందంజలో ఉండటంతో, అంతిమంగా బెంగాల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రౌండ్లలో భవానీపూర్ ఆధిక్యం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

  • 04 May 2026 12:50 PM (IST)

    రంగంలోకి దిగిన మమతా బెనర్జీ..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, తన పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. బీజేపీ 173 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి మ్యాజిక్ ఫిగర్ దాటేసినప్పటికీ, ఫలితాలు ఇంకా పూర్తిగా రానందున ఎవరూ అధైర్యపడవద్దని ఆమె పిలుపునిచ్చారు. "ధైర్యం కోల్పోకండి, ఇంకా చాలా రౌండ్ల లెక్కింపు మిగిలి ఉంది" అని మమత తన సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న తమ పార్టీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని, లెక్కింపు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ప్రతి ఓటును జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.

  • 04 May 2026 12:30 PM (IST)

    కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షన్య వెనకంజ..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీరాంపూర్ ఎంపీ, సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ తన కుమారుడు ఈ ఎన్నికల్లోనే అత్యుత్తమ అభ్యర్థి అని ప్రకటించినప్పటికీ, ఓటర్ల తీర్పు మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. హుగ్లీ జిల్లాలోని ఉత్తరపరా (Uttarpara) నియోజకవర్గంలో కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షన్య బందోపాధ్యాయ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ వ్యూహాత్మకంగా బరిలోకి దింపిన మాజీ ఎన్‌ఎస్‌జీ (NSG) కమాండో దీపాంజన్ చక్రవర్తి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక సామాన్య యోధుడికి, రాజకీయ వారసుడికి మధ్య జరిగిన ఈ పోరులో ప్రస్తుతానికి మాజీ కమాండోనే పైచేయి సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 173 స్థానాల్లో ముందంజలో ఉండి సంబరాల్లో మునిగిపోగా, కీలక నేతల వారసులు వెనుకబడటం తృణమూల్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.

  • 04 May 2026 12:25 PM (IST)

    జై శ్రీరామ్.. నినాదాలు

    పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. భారత ఎన్నికల సంఘం (ECI) వెలువరించిన తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ ఏకంగా 173 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మెజారిటీ మార్కును (148) సునాయాసంగా దాటేసింది. రాష్ట్రంలో అధికారం ఖాయమవ్వడంతో కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు టపాసులు కాలుస్తూ, రంగులు పూసుకుంటూ "జై శ్రీరామ్" నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

  • 04 May 2026 12:13 PM (IST)

    సాయంత్రం బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు ప్రధాని మోడీ..

    బెంగాల్‌లో బీజేపీ సంచనల విజయం సాధించింది. బెంగాల్‌తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల బీజేపీ పార్టీ, కార్యకర్తలు ఆనందోత్సహాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు జరుగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకాబోతున్నారు.

  • 04 May 2026 12:00 PM (IST)

    గాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దేబాంగ్షు భట్టాచార్య వెనకంజ..

    పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత ఎన్నికల సమయంలో "ఖేలా హోబే" (ఆట మొదలైంది) అనే నినాదం ఎంతగా మార్మోగిందో అందరికీ తెలిసిందే. ఆ పాటకు ప్రాణం పోసిన గాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దేబాంగ్షు భట్టాచార్యకు ఈసారి మాత్రం ఫలితాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. హుగ్లీ జిల్లాలోని చూచురా (Chuchura) నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆయన ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుబీర్ నాగ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బెంగాల్ అంతటా తన పాటతో ఉత్సాహం నింపిన దేబాంగ్షుకు, తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఓటర్లు 'ఖేలా శేష్' (ఆట ముగిసింది) అని చెప్తున్నట్లుగా ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తన ప్రభావాన్ని చాటుకుంటున్న తరుణంలో, టీఎంసీకి చెందిన ప్రముఖ యువనేత వెనుకబడి ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • 04 May 2026 11:39 AM (IST)

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బంకురా యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వెలుపల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా అక్కడ రణరంగంలా మారింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు లాఠీచార్జ్ చేశాయి. బలగాలు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. జంగల్‌మహల్ ప్రాంతంలోని బంకురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణంలో ఈ ఘర్షణలు జరగడం గమనార్హం.

  • 04 May 2026 11:19 AM (IST)

    హౌరా జిల్లాలోని శిబ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యం..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో హౌరా జిల్లాలోని శిబ్పూర్ (Shibpur) నియోజకవర్గం నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతోంది. ప్రెసిడెన్సీ రీజియన్ పరిధిలోకి వచ్చే ఈ స్థానంలో నటుడు, బీజేపీ అభ్యర్థి రుద్రానీల్ ఘోష్ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం, ఆయన 18,019 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థిపై 5,823 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థికి ప్రస్తుతం 12,196 ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న శిబ్పూర్‌లో, ఈసారి రుద్రానీల్ ఘోష్ సాధిస్తున్న ఈ ఆధిక్యం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే దానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి మ్యాజిక్ ఫిగర్ (148) దాటేసిన తరుణంలో, శిబ్పూర్ వంటి స్థానాల్లో లభిస్తున్న ఈ మెజారిటీ ఆ పార్టీకి మరింత బలాన్నిస్తోంది.

  • 04 May 2026 11:09 AM (IST)

    ఆర్జీకర్ బాధితురాలి తల్లి ముందంజ.

    దేశాన్ని, ముఖ్యంగా బెంగాల్‌ను ఓ కుదుపు కుదిపిన ఆర్జీకర్ హత్యాచారం ఘటన బాధితురాలి తల్లి పనిహటీ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నుంచి టికెట్ పొందిన ఈమెకు ప్రధాని మోడీ ప్రచారం కూడా చేశారు.

  • 04 May 2026 11:00 AM (IST)

    భవానీపూర్‌లో బీజేపీ ఆధిక్యం..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్‌లో అత్యంత కీలకమైన భవానీపూర్ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో వెనుకంజలో ఉన్నప్పటికీ, తర్వాతి రౌండ్లలో తాను పుంజుకున్నానని ప్రతిపక్ష నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వెల్లడించారు. మొదటి రౌండ్ ముగిసేసరికి మమతా బెనర్జీ సుమారు 1,996 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆ తర్వాత జరిగిన లెక్కింపులో తాను దాదాపు 2,200 ఓట్ల మెజారిటీతో ముందంజలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన ప్రజాధేశం లభిస్తోందని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. అయితే, కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నందున, అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాతే పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. బెంగాల్ వ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ 138కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ 123 స్థానాల్లో ముందంజలో ఉంది. భవానీపూర్ ఫలితం ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకం కావడంతో, ఇక్కడి ప్రతి రౌండ్ అప్‌డేట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

  • 04 May 2026 10:53 AM (IST)

    రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 138 స్థానాల్లో బీజేపీ ముందంజ

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ తన జోరును కొనసాగిస్తోంది. తాజాగా వెలువడిన తొలి రౌండ్ ఫలితాల ప్రకారం, ఖరగ్‌పూర్ రూరల్, ఘటల్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఖరగ్‌పూర్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తపన్ భూయాన్ తొలి రౌండ్ ముగిసేసరికి 2,559 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి లభించిన ఈ ఆరంభం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అటు ఘటల్ స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థి తన పట్టు నిరూపించుకుంటున్నారు. మొదటి రౌండ్ లెక్కింపు తర్వాత ఆయన 3,676 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 138 స్థానాల్లో ముందంజలో ఉండి, టీఎంసీపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో, ఈ కీలక స్థానాల్లో లభిస్తున్న ఆధిక్యం కమలం పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నట్లు సూచిస్తోంది. అయితే, ఇవి కేవలం ప్రారంభ రౌండ్ల ఫలితాలు మాత్రమే కావడంతో, రాబోయే రౌండ్లలో ఈ ఆధిక్యం ఏ మేరకు స్థిరంగా ఉంటుందో చూడాలి. బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో ప్రతి రౌండ్ ఫలితం మమతా బెనర్జీ, బీజేపీ భవిష్యత్తును నిర్ణయించనుంది.

  • 04 May 2026 10:36 AM (IST)

    కత్వా నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యం..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో కత్వా (Katwa) నియోజకవర్గంలో బీజేపీ ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. తాజా కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ అభ్యర్థి కృష్ణ ఘోష్ తన ప్రత్యర్థులపై భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన 5,500 కంటే ఎక్కువ ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ముందంజలో ఉన్నారు. లెక్కింపు ప్రారంభ దశలోనే ఇంతటి భారీ మార్జిన్ లభించడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ఆధిక్యం ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇంకా మరిన్ని రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ, కృష్ణ ఘోష్ సాధించిన ఈ ముందంజ కత్వా స్థానంలో బీజేపీ జెండా ఎగురవేయడానికి బలమైన పునాదిగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 138 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణంలో, కత్వా వంటి కీలక స్థానాల్లో లభిస్తున్న ఈ మెజారిటీ పార్టీకి మరింత బలాన్నిస్తోంది.

  • 04 May 2026 10:24 AM (IST)

    హల్దియా నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో కీలకమైన హల్దియా (Haldia) నియోజకవర్గంలో పోరు ఉత్కంఠగా సాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ బిజిలీ తన సమీప ప్రత్యర్థిపై స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 536 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
    హల్దియా స్థానంలో ఆధిక్యం నిలకడగా లేకపోవడం, మార్జిన్ చాలా తక్కువగా ఉండటంతో ఇక్కడ ప్రతి ఓటు నిర్ణయాత్మకంగా మారనుంది. రౌండ్ రౌండ్‌కు సమీకరణాలు మారుతుండటంతో, ఈ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లెక్కింపు తుది దశకు చేరుకునే కొద్దీ ఈ స్వల్ప ఆధిక్యం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఇరు పార్టీల శ్రేణుల్లో కనిపిస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో పారిశ్రామికంగా ప్రాముఖ్యత ఉన్న హల్దియా వంటి స్థానాల్లో గెలుపు, అటు తృణమూల్, ఇటు బీజేపీకి ప్రతిష్టాత్మకమని చెప్పవచ్చు. అందుకే అందరి కళ్లు ఇప్పుడు ఈ 'క్లోజ్ కాంటెస్ట్' సీటుపైనే ఉన్నాయి.

  • 04 May 2026 10:23 AM (IST)

    హుయామున్ కబీర్ వెనుకంజ.

    ఏజేయూపీ చీఫ్ హుమాయున్ కబీర్ రెజినగర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల ముందు బాబ్రీ మసీదును నిర్మిస్తామని ప్రకటించిన ఈయన ప్రస్తుతం ఓటమి దిశగా వెళ్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి బాపన్ ఘోష్ లీడింగ్ లో ఉన్నారు.

  • 04 May 2026 09:57 AM (IST)

    "135 ప్లస్" స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయ: సువేందు అధికారి

    ఈ ట్రెండ్స్‌పై సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, తాము "135 ప్లస్" స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. హిందూ ఓటర్లందరూ బీజేపీ వైపు పటిష్టంగా కేంద్రీకృతమయ్యారని, ఇది పార్టీకి ఒక శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. భబానీపూర్‌లో మమత ఆధిక్యం సాధించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

  • 04 May 2026 09:57 AM (IST)

    బెంగాల్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..

    బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజారిటీ మార్కును దాటింది. మొత్తం 294 సీట్లలో 148 సీట్లు సాధించిన వారు అధికారాన్ని చేపట్టవచ్చు. ప్రస్తుతం బీజేపీ 150+ స్థానాలకు పైగా లీడింగ్‌లో ఉంది.

  • 04 May 2026 09:56 AM (IST)

    పుంజుకున్న మమతా బెనర్జీ..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల లెక్కింపులో అత్యంత ఉత్కంఠ రేపుతున్న భబానీపూర్ నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రారంభంలో వెనుకంజలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తాజాగా తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారిపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ మళ్ళీ పుంజుకున్నారు.

  • 04 May 2026 09:38 AM (IST)

    పురూలియాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ భారీ ఆధిక్యం..

    పురూలియా జిల్లా – 9 అసెంబ్లీ నియోజకవర్గాలు:

    పురూలియా – బీజేపీ – ఆధిక్యం
    బలరాంపూర్ – బీజేపీ – ఆధిక్యం
    మాన్‌బజార్ – బీజేపీ – ఆధిక్యం
    రఘునాథ్‌పూర్ – బీజేపీ – ఆధిక్యం
    పారా – బీజేపీ – ఆధిక్యం
    కాశీపూర్ – బీజేపీ – ఆధిక్యం
    బాఘ్‌ముండి – టీఎంసీ – ఆధిక్యం
    బంద్వాన్ – టీఎంసీ – ఆధిక్యం
    జైపూర్ – బీజేపీ – ఆధిక్యం

  • 04 May 2026 09:36 AM (IST)

    భబానీపూర్‌లో మమతపై సువేందు అధికారి 3,000 ఓట్ల ఆధిక్యం..

    భబానిపూర్ నియోజకవర్గంలో మమత బెనర్జీపై సువెందు అధికారి 3,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 May 2026 09:30 AM (IST)

    శంషేర్‌గంజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం..

    జాంగిపూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, సూతిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. శంషేర్‌గంజ్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 May 2026 09:07 AM (IST)

    తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, టీఎంసీ 100 మార్కును దాటాయి

    తొలి ట్రెండ్‌లు వెలువడుతుండటంతో బీజేపీ 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 100 స్థానాల్లో ముందంజలో ఉంది.

  • 04 May 2026 09:02 AM (IST)

    ఈ నియోజకవర్గాల్లో టీఎంసీ ముందంజ..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ వేగం పుంజుకోవడంతో తొలి ఫలితాల ట్రెండ్స్ బయటకు వస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, బగ్నాన్ (Bagnan), అమ్తా (Amta) నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆధిక్యంలో కొనసాగుతోంది. వీటితో పాటు బోల్పూర్, చాంచల్, సుజాపూర్, రతువా నియోజకవర్గాల్లోనూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

  • 04 May 2026 08:56 AM (IST)

    బీజేపీ భారీ నాయకుడు అర్జున్ సింగ్ ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నోవాపారా (Noapara) నియోజకవర్గంలో బీజేపీ భారీ నాయకుడు అర్జున్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం నిన్నటి నుంచే వార్తల్లో నిలిచింది. దత్తపుకూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన వందలాది వివిప్యాట్ (VVPAT) స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండటం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌కు సంబంధించినవే ఇవని భావించిన బీజేపీ, తృణమూల్, సీపీఎం పార్టీలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించాయి. అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. రోడ్డుపై కనిపించిన ఆ స్లిప్పులు అసలు పోలింగ్‌కు సంబంధించినవి కావని, ఎన్నికలకు ముందు నిర్వహించిన మాక్ పోల్ (Mock Poll) లోనివని స్పష్టతనిచ్చింది. ఈ వివాదం నడుమ నేడు వెలువడుతున్న తొలి ట్రెండ్స్‌లో అర్జున్ సింగ్ ఆధిక్యం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • 04 May 2026 08:44 AM (IST)

    మాకు 168-174 సీట్లు వస్తాయి: బీజేపీ

    మణిక్తలా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తపస్ రాయ్ మాట్లాడుతూ, "నా అంచనా ప్రకారం, మాకు 168 నుంచి 174 సీట్లు వస్తాయి. ఈ ఎన్నికల్లో రక్తపాతం జరగకపోవడం, ఏ మృతదేహం దొరకకపోవడం, ఎవరి రక్తమూ చిందించకపోవడం వాళ్లకు (టీఎంసీకి) నచ్చలేదు" అని అన్నారు.

  • 04 May 2026 08:37 AM (IST)

    ఖాతా తెరవని కాంగ్రెస్..

    ఈసారి పశ్చిమ బెంగాల్‌లో మార్పు ఖాయమా? ట్రెండ్‌లు వెలువడటం ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 49 స్థానాలకు ట్రెండ్‌లు వెలువడగా, వాటిలో 29 స్థానాల్లో బీజేపీ, 20 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్, వామపక్షాలు ఇంకా ట్రెండ్‌లలో తమ ఖాతా తెరవలేదు.