Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

Bengal

Bengal

Bengal Election Results Live Updates: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు, మే 4న రాష్ట్రంలోని 294 స్థానాలకు (ఫల్తా మినహా 293 స్థానాలకు) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, ఆమెపై బీజేపీ తరపున సువేందు అధికారి, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ ప్రసాద్, సీపీఎం నుంచి శ్రీజీబ్ బిస్వాస్ పోటీ పడుతున్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్‌డెట్స్‌ మీకోసం..

  • 04 May 2026 08:28 AM (IST)

    హోరాహోరీ పోరు..

    బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ పోరు. భవానీపూర్‌లో మమత ముందంజ

  • 04 May 2026 08:18 AM (IST)

    కౌంటింగ్ షురూ..

    వెస్ట్ బెంగాల్‌లో కొనసాగుతున్న కౌంటింగ్. పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.

  • 04 May 2026 08:17 AM (IST)

    భవానీపూర్‌లో మమత ముందంజ

    భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేశారు.

  • 04 May 2026 07:55 AM (IST)

    విద్యుత్ అంతరాయం సమస్యపై ఈసీ స్పందన

    పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు ఉదయం 6:30 గంటలకు భవానీపూర్‌లోని సఖావత్ మెమోరియల్ స్కూల్ వెలుపల టీఎంసీ, బీజేపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీఎంసీ ఆరోపించింది. ఈ అంశంపై తాజాగా ఈసీ స్పందించింది. విద్యుత్ కోతల విషయం విద్యుత్ శాఖకు సంబంధించినదని ఎన్నికల సంఘం పేర్కొంది.

  • 04 May 2026 07:54 AM (IST)

    "మేము ఇక్కడికి యుద్ధం చేయడానికి రాలేదు" : డాక్టర్ శశి పాంజా

    కౌంటింగ్ ప్రక్రియలో జరుగుతున్న గందరగోళంపై డాక్టర్ శశి పాంజా ఎన్నికల కమిషన్ తీరును తప్పుబట్టారు. ఓట్ల లెక్కింపును ట్రాక్ చేయడానికి తాము సిద్ధం చేసుకున్న పత్రాలను లెక్కచేయకుండా విసిరివేస్తున్నారని ఆమె ఆరోపించారు. అసలు ఇదంతా ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సిన పని అని, కానీ అక్కడ జరుగుతున్న తీరు సబబుగా లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. "మేము ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చామా? మా దగ్గర ఏమైనా తుపాకులు, మందుగుండు సామాగ్రి ఉన్నాయా?" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం లెక్కింపు జరగాల్సింది పోయి, తాము తెచ్చుకున్న లెక్కల పత్రాలను విసిరివేయడం ఏంటని ఆమె అధికారులను నిలదీశారు.

  • 04 May 2026 07:49 AM (IST)

    కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండండి: మమతా బెనర్జీ పిలుపు

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాత్రంతా మేల్కొని, నిశితంగా నిఘా ఉంచాలని ఆమె ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా హుగ్లీ (శ్రీరాంపూర్), నదియా (కృష్ణానగర్), బర్ధమాన్ (ఆౌస్‌గ్రామ్) మరియు కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రం వంటి చోట్ల కావాలనే లోడ్ షెడ్డింగ్ (విద్యుత్ కోత) విధిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.

  • 04 May 2026 07:47 AM (IST)

    బెంగాల్‌లో ఆసక్తికర సంప్రదాయం..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో "బెల్‌వెదర్ స్థానాలు" (Bellwether Seats) అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 37 స్థానాలను నిపుణులు బెల్‌వెదర్‌ సీట్లుగా పరిగణిస్తారు. ఇవి కేవలం 13 శాతం స్థానాలే అయినప్పటికీ, బెంగాల్ రాజకీయ గమనాన్ని శాసించే శక్తి వీటికి ఉంది. 1977 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఒక ఆసక్తికరమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ 37 స్థానాల్లో ఏ పార్టీ అయితే మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందో, అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. అంటే, ఈ నియోజకవర్గాల తీర్పును బట్టే బెంగాల్‌ను పాలించేది ఎవరో ముందే అంచనా వేయవచ్చు. ఈ 37 సీట్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిలో జనరల్ స్థానాలతో పాటు ఎస్సీ (SC), ఎస్టీ (ST) రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే, ఈ స్థానాల్లో లభించే ఆధిక్యం రాష్ట్రవ్యాప్త ఓటర్ల నాడికి ప్రతిబింబంగా నిలుస్తుంది. నేటి ఓట్ల లెక్కింపులో ఈ కీలక నియోజకవర్గాల ఫలితాలు ఎటు మొగ్గుతాయనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ బీజేపీ ఈ బెల్‌వెదర్ సీట్లలో తన పట్టు నిరూపించుకుంటే, మమతా బెనర్జీ కోట కూలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • 04 May 2026 07:38 AM (IST)

    కౌంటింగ్‌కు సర్వ సిద్ధం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్

    ఇక, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియపై ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ కీలక బాధ్యతలను నిర్వహించే రిటర్నింగ్ అధికారులు (RO), సహాయ రిటర్నింగ్ అధికారులు (ARO), కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లకు ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసేందుకు 200 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) బలగాలను రంగంలోకి దించారు. అంతా పక్కాగా, నిబంధనల ప్రకారమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • 04 May 2026 07:36 AM (IST)

    సునామీ రాబోతోంది: అగ్నిమిత్ర పాల్.

    బీజేపీ నేత, అసోన్ సోల్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న అగ్నిమిత్ర పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో సునామీ రాబోతోందని, బెంగాల్ ఓటర్లు 92 శాతం ఓటింగ్ నమోదు చేశారని అన్నారు.

  • 04 May 2026 07:23 AM (IST)

    సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తుంది: సువేందు అధికారి.

    ‘‘దేవుడు మాతో ఉన్నారు, సనాతన ధర్మ ప్రయోజనాలు రక్షించే ప్రభుత్వం వస్తుంది’’ అని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు ఆయన కోల్‌కతాలోని లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఫల్తా నియోజకవర్గంలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించడంపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. ఇది ఆయన అహంకారాన్ని చూపిస్తోందని, దేశంలో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుందని, ఇలాంటి పరిస్థితులే యూపీలో ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ అంతమైందని ఆయన అన్నారు.

  • 04 May 2026 07:13 AM (IST)

    మమతా బెనర్జీకి ఎందుకంత ప్రతిష్టాత్మకం?

    భవానీపూర్ కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, అది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక. దక్షిణ కోల్‌కతా లోక్‌సభ స్థానంలో అంతర్భాగమైన ఈ నియోజకవర్గం ఆమెకు కంచుకోట వంటిది.

  • 04 May 2026 07:13 AM (IST)

    భవానీపూర్‌లో ఉద్రిక్తత..

    భవానీపూర్‌లో కౌంటింగ్ కేంద్రం వెలుపల టీఎంసీ, బీజేపీ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్ల ఎంట్రీ విషయంలో చెలరేగిన వివాదం కాస్తా పరస్పర నినాదాలకు దారితీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

  • 04 May 2026 07:07 AM (IST)

    బీజేపీ జెండా పాతనుందా?

    ప్రస్తుతం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నానికి బెంగాల్ పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారనే దానిపై స్పష్టత రానుంది. మమతా బెనర్జీ తన హ్యాట్రిక్ అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ బెంగాల్ గడ్డపై తొలిసారి జెండా పాతనుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

  • 04 May 2026 07:06 AM (IST)

    ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయంటే..?

    ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కొన్ని టీఎంసీకి మొగ్గు చూపగా, మరికొన్ని బీజేపీకి చారిత్రాత్మక విజయం ఖాయమని అంచనా వేస్తున్నాయి.

  • 04 May 2026 07:06 AM (IST)

    హై-ప్రొఫైల్ పోరు..

    గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తలపడిన మమతా బెనర్జీ, సువేందు అధికారి, ఈసారి భవానీపూర్‌లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.

  • 04 May 2026 07:05 AM (IST)

    మేజిక్ ఫిగర్ ఫిగర్ ఎంతంటే..?

    బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 148 స్థానాలు అవసరం. గత 2021 ఎన్నికల్లో తృణమూల్ 215 స్థానాలతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలకు పరిమితమైంది.

  • 04 May 2026 07:03 AM (IST)

    రికార్డు స్థాయిలో పోలింగ్..

    ఇక, ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో 92.93 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం.