Virat Kohli: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా 17 ఏళ్ల నిరక్షణకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు.. భారత జట్టుతో కలిసి చాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అంతేకాదు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్లో ఉన్నాడు. దీనితో ఇప్పుడు 2026లో కోహ్లీ ముందర మరో మూడు కీలక మైలురాళ్లు సవాలుగా మారనున్నాయి. మరి ఆ సవాళ్లు, రికార్డుల సంగతేంటో చూద్దామా..
రో–కో దెబ్బకి 8 నిమిషాల్లోనే IND vs NZ తొలి వన్డే టికెట్స్ సోల్డ్ అవుట్..!
ఐపీఎల్లో 9,000 పరుగులు:
ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా నిలవడానికి ఐపీఎల్ 2026 సీజన్లో విరాట్ కోహ్లీకి కేవలం 339 పరుగులే కావాలి. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 259 ఇన్నింగ్స్ల్లో 8,661 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్ ఆల్టైమ్ టాప్ స్కోరర్ కూడా కోహ్లీనే. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్ల్లో 7,046 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టు ఆర్సీబీకి మాత్రమే ఆడాడు. గత మూడు ఐపీఎల్ సీజన్ల్లో ఏ సీజన్లోనూ అతను 600 పరుగుల కంటే తక్కువ చేయలేదు. ఇది చాలు అతని స్థిరత్వానికి నిదర్శనంగా చెప్పుకోవడానికి.
వన్డేల్లో 15,000 పరుగులు:
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు. వన్డే క్రికెట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్గా మారే అవకాశముంది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన క్రికెట్ గాడ్ ‘సచిన్ టెండూల్కర్’ మాత్రమే ఉన్నారు. సచిన్ 452 ఇన్నింగ్స్ల్లో 18,426 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 296 ఇన్నింగ్స్ల్లో 14,557 వన్డే పరుగులతో రెండో అత్యధిక స్కోరర్గా ఉన్నాడు. 15,000 పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే అతనికి ఇంకా 443 పరుగులు అవసరం.
Usman Khawaja: ఆస్ట్రేలియాకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఏడ్చేసిన ఉస్మాన్ ఖ్వాజా
అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులు:
అంతర్జాతీయ క్రికెట్ (టెస్టులు+వన్డేలు+టీ20లు)లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచే అవకాశం కూడా 2026లోనే ఉంది. ప్రస్తుతం అతను 623 ఇన్నింగ్స్ల్లో 27,975 పరుగులు చేశాడు. కుమార సంగక్కర చేసిన 28,016 పరుగులు రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి కేవలం 42 పరుగులే కావాలి. న్యూజిలాండ్తో జరిగే 2026 తొలి మ్యాచ్లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉండటంతో ఆ మ్యాచ్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
