Manipur Violence: సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో అదనపు బలగాలు మోహరించాయి. మరణించిన ఇద్దరు వ్యక్తులను కమ్మిన్లాల్ లుఫెంగ్ , కమ్లెంగ్సట్ లుంకిమ్ అని కాంగ్పోక్పిలోని కుకి-నివాస ఎల్ చాజాంగ్ గ్రామ చీఫ్ లెనిన్ హౌకిప్ పేర్కొన్నారు. నోంగ్డమ్ కుకీ, బొంగ్జాంగ్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వీరిద్దరూ గ్రామ రక్షణ వాలంటీర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు మణిపూర్ పోలీసులు అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు.
Read Also: PM Modi: జగన్పై దాడిని ఖండించిన ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు
కాగా, ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, రాష్ట్రంలో గురువారం నుంచి మూడు వేర్వేరు హింసాత్మక ఘటనలు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, శుక్రవారం నాడు తెంగ్నౌపాల్ దగ్గర ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, గతేడాది మే నెల నుంచి మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుకీ, మోతీ తెగల మధ్య ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 221 మంది చనిపోగా.. 50 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.