సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో సీఎస్ఆర్ నిధుల నుండి 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం భవనం, 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ మరియు ఎంపీటీసీ జడ్పీటీసీల హక్కులను హరించిందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకుండా, వారిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందన్నారు ఉత్తమ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను బలోపెతం చేస్తామని, కేసీఆర్ ఒక నియంతల వ్యవహరించాడన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా, నేరుగా ఢిల్లీ నుంచి పవర్ పైనన్స్ కార్పొరేషన్ నిధుల ద్వారా, దాదాపు 20 గ్రామాల కు పంచాయితీ భవనం కోసం 25లక్షలు, అంగన్వాడీ భవనం కోసం 10లక్షలు మంజూరు చేయించానన్నారు.
ఇదిలా ఉంటే.. కృష్ణా బోర్డు పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. పదేళ్ళలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఏపీ డైవర్ట్ చేసుకున్నారన్నారు. ఏపీ వాళ్ళు 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతుంటే బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తెలంగాణకు వస్తుంటే కాదని.. లక్ష కోట్లతో గోదావరి నీటిని వాడుకుంటామని కాళేశ్వరం కట్టారని విమర్శించారు. బీఆర్ఎస్.. చేసిన ద్రోహాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కాగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి ఏడు మండలాలు పోయాయని ఉత్తమ్ తెలిపారు.