US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్

Trump124

Trump124

US-Iran Tensions: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. చివరి నిమిషంలో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. ఈ ఉత్కంఠభరిత పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్‌లో ఓ కీలకమైన హై-లెవెల్ మీటింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ట్రంప్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకవేళ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు పూర్తిగా బెడిసికొడితే ఎలాంటి సైనిక చర్యలు చేపట్టాలనే ముసాయిదా ప్రణాళికలపై ట్రంప్ ఈ సమావేశంలో సమీక్షించారు. పరిస్థితి ఎంత సున్నితంగా మారిందంటే, ఈ మీటింగ్ ముగిసిన వెంటనే ట్రంప్ తన వీకెండ్ ప్లాన్స్‌ను సైతం మార్చుకున్నారు. చివరికి తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు సైతం వెళ్లకుండా వాషింగ్టన్‌లోనే ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. “ప్రభుత్వ అత్యవసర పరిస్థితులు, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం” కాబట్టే తాను వైట్ హౌస్‌లోనే ఉంటున్నట్లు ట్రంప్ స్వయంగా తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు.

మరోవైపు యుద్ధాన్ని నివారించడానికి దౌత్య ప్రయత్నాలు నడుస్తున్నప్పటికీ, అవి చాలా బలహీనంగా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ప్రస్తుతం టెహ్రాన్‌లో పర్యటిస్తున్నారు. చివరి ప్రయత్నంగా జరుగుతున్న ఈ మధ్యవర్తిత్వానికి మద్దతుగా కతార్ ప్రతినిధుల బృందం సైతం ఇరాన్ రాజధానికి చేరుకుంది. అక్కడ అసిమ్ మునీర్.. ఇరాన్ భద్రతా విభాగంలో అత్యంత కీలకమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జనరల్ అహ్మద్ వహీదీతో భేటీ కానున్నారు. అయితే, ఈ చర్చలు నత్తనడకన సాగుతున్నాయని, దాదాపు నిలిచిపోయే స్థితికి వచ్చాయని అధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రతిరోజూ ఇరు దేశాల మధ్య ప్రతిపాదనల పత్రాలు మారుతున్నాయే తప్ప, అసలైన సమస్యలపై ఎలాంటి పురోగతి లేదని ఓ అమెరికా అధికారి వాపోయారు. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు కూడా చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, ఒప్పందం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతానికైతే కేవలం యుద్ధాన్ని ముగించడంపైనే దృష్టి పెట్టామని ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనికి తోడు, ఈ వారంలో అమెరికా పంపిన సరికొత్త ప్రతిపాదనను ఇరాన్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. అమెరికా పంపిన ‘చివరి అవకాశం’ (ఫైనల్ ఆఫర్) ఇదేనని, దీనిని తిరస్కరిస్తే మళ్లీ యుద్ధం తప్పదని అమెరికా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఇరాన్ కాలయాపన ధోరణిపై ట్రంప్ సర్కార్‌లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మొదట్లో కాస్త ఓపికగా ఉన్న ట్రంప్ మూడ్, గత కొన్ని రోజులుగా ఇరాన్ అనుసరిస్తున్న తీరుతో పూర్తిగా మారిపోయింది. వారం ఆరంభంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడుతూ దౌత్య రంగానికి మరో అవకాశం ఇద్దామన్న ట్రంప్, గురువారం రాత్రి కల్లా ఇరాన్‌పై దాడి చేయడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికి, తానే విజేతగా నిలిచేలా ఒకే ఒక్క ‘నిర్ణయాత్మక’ భారీ సైనిక చర్య చేపట్టడంపై ట్రంప్ చర్చించినట్లు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు మీడియాకు తెలిపారు. అయినప్పటికీ, రాబోయే 24 గంటల్లో ఏదైనా అద్భుతం జరిగి దౌత్యపరమైన బ్రేక్‌థ్రూ లభిస్తుందని కొందరు అధికారులు ఆశగా ఉన్నారు. ఒకవేళ ఇరాన్ వైపు నుంచి ఆశించిన స్పందన రాకపోతే ట్రంప్ సైనిక చర్యకే దిగుతారని ఎక్కువమంది భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్‌లతో మూడు నెలల పాటు సాగిన ప్రత్యక్ష యుద్ధం ముగిసి, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది వారాల్లోనే ఇరాన్ మళ్లీ తన డ్రోన్ల ఉత్పత్తి వ్యవస్థను పునరుద్ధరించే పనిలో పడింది. అమెరికా నిఘా వర్గాల అంచనాల కంటే చాలా వేగంగా ఇరాన్ తన సైనిక పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెడుతోందని ఇంటెలిజెన్స్ నివేదికలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ (CNN) ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ పరిణామం కూడా అమెరికాను మరింత అప్రమత్తం చేసింది.