Cyber Crime: డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత.. సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఠక్కుటమార విద్యలతో జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు. చిత్రవిచిత్రంగా జనం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సైబర్ క్రైమ్ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఏపీలోని ఇద్దరు వ్యక్తులను మోసం చేసి డబ్బు కొట్టేశాడు కేటుగాడు. దీంతో యూపీఐ చెల్లింపులు చేయాలన్నా జనం భయపడే పరిస్థితి ఏర్పడుతోంది.అసలు ఇంతకు ఈ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన ఓ సైబర్ క్రైం కేసు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఒకే క్రైమ్.. ఒకే మోసం బాధితులు మాత్రం ఇద్దరు. ఘటనలు మాత్రం రెండు రాష్ట్రాల్లో జరిగాయి. యర్రగొండపాలెంకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి IDFC బ్యాంక్ ద్వారా అనుమతులు తీసుకుని ఆధార్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లో ఫోన్ పే లావాదేవీలు చేసేందుకు సెంటర్ నిర్వహిస్తున్నారు. డబ్బులు వేయించుకుని కమిషన్ తీసుకుని నగదు ఇచ్చే పని చేస్తుంటాడు. ఇదే పనిని తన జీవనాధారంగా చేసుకున్న ఆదినారాయణకు ఓ రోజు సైబర్ నేరగాడు షాకిచ్చాడు. షాప్కు వచ్చిన ఒక వ్యక్తి.. మా సార్ అకౌంట్ నుంచి మీ ఫోన్ పేకి డబ్బులు వేస్తారు. కమిషన్ కట్ చేసి క్యాష్ ఇవ్వాలని అడిగాడు.
ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
అడిగిన తీరులో ఎలాంటి అనుమానం రాకపోవడంతో ఆదినారాయణ తన ఫోన్ పే నెంబర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆ ఫోన్ పే అకౌంట్లోకి 70 వేల రూపాయలు జమ అయ్యాయి. డబ్బులు జమ అయిన మెసేజ్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్.. అన్నీ కరెక్ట్గా కనిపించడంతో ఆదినారాయణ ఎలాంటి అనుమానం లేకుండా 70 వేల రూపాయలకు కమిషన్ కట్ చేసుకుని నగదు ఇచ్చేశాడు. డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
సీన్ కట్ చేస్తే.. డబ్బులు ఇచ్చిన ఐదు నిమిషాలకు ఆదినారాయణకు మరో ఫోన్ కాల్ వచ్చింది. అది విని అతడు షాక్ అయ్యాడు. పొరపాటున మీ అకౌంట్లో రూ. 70 వేలు పడ్డాయి. ఆ డబ్బులు రిటర్న్ కొట్టిండి అని అవతలి వ్యక్తి అడిగాడు. ఒక్కసారిగా షాక్కు గురైన ఆదినారాయణ ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో పడ్డాడు. ఐతే తేరుకున్న ఆదినారాయణ తన వద్ద జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో అవతలి వ్యక్తి తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏం తెలియని ఆదినారాయణ బ్యాంక్ అకౌంట్ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. లావాదేవీలు ఆగిపోవడంతో ఆదినారాయణ తలపట్టుకున్నాడు.
ఈ కేసులో పోలీసులు తీగ లాగితే.. తెలంగాణలో అసలైన మోసం వెలుగు చూసింది. నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన అనిల్ రెడ్డి అనే వ్యక్తికి అత్యవసరంగా లిక్విడ్ క్యాష్ అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఎస్సై అనంత్ రెడ్డి అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి నా దగ్గర 70 వేల రూపాయల క్యాష్ ఉంది ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ ఫోన్ చేస్తున్నాడని అనిల్ రెడ్డి స్నేహితుడు చెప్పాడు. తన అవసరం తీరుతుందన్న ఆశతో అనిల్ రెడ్డి ఎస్సై అనంత్ రెడ్డి అని దొంగ పేరు పెట్టుకున్న కేటుగాడికి ఫోన్ చేశాడు. మీకు 70 వేల క్యాష్ ఇస్తాను ఒక ఫోన్ పే నెంబర్కు 70 వేల రూపాయలు పంపించండి అంటూ కేటుగాడు నమ్మబలికాడు.
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
మరింత నమ్మకం కలిగేలా పోలీస్ స్టేషన్ దగ్గరకు రండి అక్కడే డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. కేటుగాడి మాటలను నమ్మిన అనిల్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. కానీ అక్కడికి వెళ్లాక డబ్బులు ఇవ్వడం కుదరదని ఫోన్లో చెప్పిన కేటుగాడు పోలీస్ స్టేషన్ దగ్గర చాలా మంది ఉంటారు.. ఇక్కడ ఇవ్వలేను మీరు అక్కడే ఉండండి డబ్బులు క్యాష్గా పంపిస్తాను అని కాల్లో చెప్పాడు. డబ్బులు ఏ నెంబర్కు పంపాలని అడగగా కేటుగాడు యర్రగొండపాలెంకు చెందిన ఆదినారాయణ ఫోన్ పే నెంబర్ ఇచ్చాడు. అనిల్ రెడ్డి తన అన్న నవీన్ రెడ్డికి ఫోన్ చేసి మొత్తం విషయం వివరించి ఆ నెంబర్కు 70 వేల రూపాయలు ఫోన్ పే చేయించాడు.
ఇక పోలీస్ స్టేషన్ బయట వేచి ఉన్న అనిల్ రెడ్డికి ఎంతసేపటికీ డబ్బులు అందకపోవడంతో అన్నకు ఫోన్ చేసి అడిగాడు. డబ్బులు పంపించావా? అని ప్రశ్నించగా.. ఫోన్ పే చేశాను నీకు ఇంకా క్యాష్ ఇవ్వలేదా? అని నవీన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. అప్పుడే మోసం జరిగిందని గ్రహించిన ఇద్దరూ.. కేటుగాడికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ కేసు నమోదు అయింది. ఐతే అప్పటికే ఆదినారాయణ వద్ద డబ్బులు తీసుకుని చెక్కేశాడు కేటుగాడు. అంటే ఆది నారాయణ దగ్గర ఉండే అనిల్ రెడ్డిని లైన్ లో పెట్టాడన్నమాట.
T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
ఈ కేసులో ఏం తెలియని ఆదినారాయణ.. బ్యాంక్ అకౌంట్ను అధికారులు ఫ్రీజ్ చేయడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. కేటుగాడు డబ్బులు తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యర్రగొండపాలెం పోలీసులు కేటుగాడిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.