Union Budget 2025: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 యూనియన్ బడ్జెట్లో భాగంగా AI అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ, ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను (CoEs) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాలు అధునాతన AI పరిశోధనకు, విద్యా రంగంలో AI వినియోగాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల కోసం AI ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ అసెస్మెంట్లు, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించేందుకు వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Also Read: Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’
AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులను కేటాయించింది. ఈ చర్య ద్వారా అదనంగా 6,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్, విద్యా సదుపాయాలు అందించనుంది. IIT భిలాయ్, IIT ధార్వాడ్, IIT గోవా, IIT జమ్మూ, IIT తిరుపతి లాంటి ఐదింటికి ఈ విస్తరణ లభించనుంది. సాంకేతికత, AI, విద్య – ఈ మూడు రంగాల్లో అభివృద్ధి సాధించి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలని మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ వ్యూహం ద్వారా AI పరిశోధనను వేగవంతం చేసి, దేశాన్ని AI రంగంలో అగ్రగామిగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: Railway Stocks: బడ్జెట్ సెషన్స్ వేళ లాభాల్లో రైల్వే స్టాక్స్..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు. భారతదేశంలో AI ప్రతిభను పెంచేందుకు, పరిశోధన అవకాశాలను మెరుగుపర్చేందుకు, విద్యా వ్యవస్థను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత విద్యా వ్యవస్థలో AI వినియోగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు, దేశ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారబోతున్నాయి.