NTV Telugu Site icon

Kota: కోట సూసైడ్ ఫ్యాక్టరీగా ఎందుకు మారుతోంది..? మరో ఇద్దరు విద్యార్థులు మృతి

Kota Students

Kota Students

దేశంలోనే కోచింగ్‌ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోచింగ్‌ల కోసం కోటాకు వస్తుంటారు. వారిలో కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు ఒత్తిడిని తట్టుకోలేక జీవితాలను ముగిస్తున్నారు. మరోవైపు.. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల గణాంకాలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి.

కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా.. మూడు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు చనిపోయారని, మరో ఇద్దరు కొన్ని రోజుల తర్వాత కనిపించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.

CM YS Jagan: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

రోజురోజుకూ పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలతో కోట ఆత్మహత్యల కర్మాగారంగా మారుతుంది. సమాచారం ప్రకారం, కోటాలో ప్రతి పది మంది విద్యార్థులలో నలుగురు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కోటాలో సుమారు మూడు వేల ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి, వీటిలో 245 వేల గదులు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం కోటాలో కోచింగ్ పరిశ్రమ విలువ ఐదు వేల కోట్లు.

మంగళవారం కోటాలో నీట్‌కు ప్రిపేర్ అవుతున్న రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు చెందిన భరత్‌ రాజ్‌పుత్ (20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భరత్ తన మేనల్లుడు రోహిత్‌తో కలిసి పీజీలో ఉండేవాడు. ఇద్దరూ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్‌కు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఉదయం రోహిత్ కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చేసరికి గది తలుపులు మూసి లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. భరత్‌ని ఎంత పిలిచినప్పటికీ.. స్పందించకపోవడంతో పీజీ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత గది తలుపులు పగులగొట్టి చూడగా భరత్ లోపల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బెడ్‌షీట్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరోవైపు.. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఒకవైపు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నిందించడం సరికాదని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ అన్నారు. ప్రతి విషయంలోనూ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దోషి కాదని తెలిపారు. కొన్నిసార్లు, విద్యార్థుల తప్పు సహవాసం, ప్రేమలో వైఫల్యం కూడా కారణం కావచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పఠన సామర్థ్యం నుండి ఎక్కువ ఆశిస్తారు. దీంతో ఆ విద్యార్థులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారన్నారు. చాలా సార్లు ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లలు అమ్మా నాన్న నీ కోరిక తీర్చలేకపోయా అని సూసైడ్ నోట్ రాస్తున్నారని.. మీరిచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చనిపోతున్నారని మంత్రి తెలిపారు.