గడిచిన రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వచ్చే 3-4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణశాఖ అంచనాలతో, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఈ రోజు సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని జిల్లాల కలెక్టర్లను వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండి, ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసిన పచ్చరొట్ట, ప్రత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందే విధంగా చూడాలని ఆదేశాలు ఇవ్వవల్సిందిగా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తేదీ 03.06.2024 నాటికి ప్రత్తి విత్తనాలు, నిన్న సరఫరా ఐన 10,43,474 ప్యాకెట్లతో కల్పి 84,43,474 సరఫరా కావడం జరిగిందని, ఇప్పటికే రైతులు 25,10,430 పత్తిప్యాకెట్లు రైతులు కొనుగోలు చేయడం జరిగిందని అధికారులు మంత్రి తెలియజేసారు.
కంపెనీ వారీగా సరఫరా సమీక్షించి, మన ప్రణాళిక ప్రకారం ఇంకా రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన ప్రత్తి ప్యాకెట్లను కూడా రైతులకు ఈ మూడు రోజులలో అందుబాటులో ఉంచేటట్లు చూడాలని మంత్రివర్యులు ఆదేశించారు. పచ్చిరొట్ట విత్తనాలు ఈ తేదీ నాటికి గత సంవత్సరములో 37959.60 క్వింటాలు రైతులు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరము ఇప్పటికే 97,109 క్వింటాలు అందుబాటులో ఉంచగా, రైతులు 84,412 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారని అధికారులు తెలియజేసారు. ప్రభుత్వం సరఫరా చేయతలపెట్టిన విత్తనాలను ఈ 4,5 రోజుల్లో రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలియజేసారు.
కొన్ని ప్రాంతాలలో పచ్చిరొట్ట విత్తనాలును ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి రావడం జరిగిందని మన రాష్ట్ర రైతు ప్రయోజనాలను పణoగా పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా అనుమతి లేకుండా ప్రత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మంది పై కేసులు పెట్టి 200.49 లక్షల రూపాయల విలువగల 118.29 క్వింటాళ్ళ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారని, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఇద్దరు డీలర్లపై కేసులుపెట్టడం జరిగిందని అధికారులు తెలియజేసారు. ప్రత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరంమేర అందుబాటులో ఉన్నాయని, రైతులందరు అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని ప్రైవెట్ వ్యక్తులవద్ద, మాయమాటలు చెప్పి అమ్మే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు మరొకమారు మంత్రి విజ్ఞప్తి చేసారు.