US-Iran Tensions: “ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే”.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!

Us Iran Talks

Us Iran Talks

US-Iran Tensions: అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి తీవ్ర దౌత్య యుద్ధం మొదలైంది. ఇరాన్‌తో ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరిందని, ఇకపై ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయబోదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి చేసిన ప్రకటనను ఇరాన్ కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య ఎలాంటి తుది ఒప్పందమూ జరగలేదని, వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయ్ స్పష్టం చేశారు. ఒకవైపు వచ్చే వీకెండ్‌లోనే యూరప్‌లో సంతకాల వేడుక ఉండబోతోందని, తన తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ దీనికి హాజరవుతారని ట్రంప్ ధీమా వ్యక్తం చేయగా.. ఇరాన్ మాత్రం తాము ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, తమ ‘రెడ్ లైన్స్’ (సహన రేఖలు) విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. శాంతి చర్చల విషయంలో మొదటి నుంచి తమ వైఖరి స్పష్టంగానే ఉందని, ఒప్పందానికి సంబంధించిన చాలా భాగం ఇప్పటికే సిద్ధమైనప్పటికీ, అమెరికా పదే పదే తన మాట మారుస్తూ ఉండటం వల్లే దౌత్య ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని బఘయ్ ఆరోపించారు. ప్రస్తుతం ఖతార్, పాకిస్థాన్‌లు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తులుగా చురుకైన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటం, అక్కడ భద్రత క్షీణించడం వెనుక పూర్తిగా అమెరికా సైనిక చర్యలే కారణమని ఇరాన్ బలంగా వాదిస్తోంది. ఈ ఒప్పందంపై సంతకాలు జరగ్గానే హార్ముజ్ జలసంధిని అధికారికంగా నౌకల రాకపోకల కోసం తెరుస్తామని ట్రంప్ ప్రకటించగా, దానికి భిన్నంగా అమెరికా సైనిక కదలికల వల్లే ఆ ప్రాంతం ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందని ఇరాన్ హెచ్చరించింది.

×
×
Ad

ఈ దౌత్యపరమైన వివాదం ఇలా నడుస్తుండగానే, అమెరికాపై ఇరాన్ మరో సంచలన ఆరోపణ చేసింది. ఇటీవల భారతీయ వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రూరమైన దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఇది అమెరికా చేస్తున్న సాయుధ దోపిడీకి, ఆ దేశ ప్రభుత్వ ప్రాయోజిత సముద్రపు దొంగతనానికి నిలువెత్తు నిదర్శనమని బఘయ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ దాడుల్లో మరణించిన అమాయక భారతీయ నావికుల కుటుంబాలకు, స్నేహితులకు ఇరాన్ తన గాఢ సానుభూతిని ప్రకటించడంతో పాటు భారత ప్రజలకు, భారత ప్రభుత్వానికి తమ సెంటిమెంట్లను తెలియజేసింది. అంతర్జాతీయ శాంతిని, భద్రతను, నౌకల స్వేచ్ఛను ప్రమాదంలోకి నెడుతున్న అమెరికా చట్టవిరుద్ధమైన ప్రవర్తనను అంతర్జాతీయ సమాజం గమనించాలని, ఈ దాడులకు అమెరికాను పూర్తిగా బాధ్యుడిని చేస్తూ నిలదీయాలని ఇరాన్ గట్టిగా పిలుపునిచ్చింది.