Trump: అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే పాకిస్థాన్ నుంచి వెనుదిరిగాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇరాన్ను “రాతియుగానికి” తిరిగి పంపుతానని ట్రంప్ ఇప్పటికే బెదిరించారు. ఇరాన్ సముద్ర మార్గాలను దిగ్బంధిస్తానని ప్రకటించారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్కు ఊపిరి ఆడకుండా చేసేందుకు ‘నావికా దళ దిగ్బంధనం’ (Naval Blockade) అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో ఒక వార్తా కథనాన్ని పంచుకున్నారు. వాస్తవానికి.. చర్చల ఫలితాలు వెలువడక ముందే ఈ వార్తా కథనం ప్రచురితమైంది. ఈ తుది ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరిస్తే, ట్రంప్ ముందు అనేక మార్గాలు ఉన్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్పై ఆర్థిక, సైనిక ఒత్తిడి పెంచడానికి ట్రంప్ వద్ద అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఈ కథనం చెబుతోంది. గతంలో వెనిజులా విషయంలో ట్రంప్ అనుసరించిన నావికా దిగ్బంధన వ్యూహం విజయవంతమైంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఇరాన్పై అమలు చేస్తే, ఆ దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. దీనివల్ల ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
READ MORE: US-Iran Talks: “టైమ్ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో అమెరికా తన నౌకా బలగాలను భారీగా మోహరించింది. వెనిజులా దిగ్బంధనంలో కీలక పాత్ర పోషించిన యుద్ధనౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్’ మరమ్మతుల తర్వాత మళ్లీ రంగంలోకి దిగింది. ఇది ఇప్పుడు ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ నౌకతో కలిసి ఇరాన్ సమీపంలో మోహరించింది. సెక్యూరిటీ ఎక్స్పర్ట్ రెబెక్కా గ్రాంట్ అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి)పై పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా నౌకాదళానికి చాలా సులభం. ఒకవేళ అమెరికా గనుక నిఘా పెంచితే, ఓమన్ లేదా ఖార్గ్ ద్వీపం వైపు వెళ్లే ఏ నౌకైనా అమెరికా సైన్యం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రిటైర్డ్ జనరల్ జాక్ కీన్ మరింత ఘాటైన సూచనలు చేశారు. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ‘ఖార్గ్ ద్వీపం’పై అమెరికా దాడి చేయాలని లేదా దానిని స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.