మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు:
రాష్ట్ర ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఉన్న పి.రాజబాబును ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. గనులశాఖపై ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. గత కొన్ని రోజులుగా రాజాబాబు ఆఫీసుకు కూడా హాజరుకావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది మంత్రుల ఓఎస్డీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం:
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్ జిల్లా యంత్రాగం, టీటీడీ కలిసి సర్వం సిద్ధం చేశాయి. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు.
బైకును ఢీ కొట్టిన కారు.. యువతి మృతి:
నగరంలో మరో హిట్ అండ్ రన్ చోటుచేసుకుంది. స్కోడా కారు ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న యువతి మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడా వద్ద బైక్ ను ఢీ కొట్టి కారుతో పారి పోతుండగా చైతన్యపురి వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద బైక్ ను ఢీకొట్టిన ప్రదీప్ వర్మ పారిపోయే ప్రయత్నం చేశాడు.. కారు అద్దం పగిలి, అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో.. కారును ఆపిన చైతన్యపురి పోలీసులు ప్రశ్నించారు. కారు డ్యామేజ్ అయ్యింది.. రిపేర్ కి వెళ్తున్న అని బుకాయించే ప్రయత్నం చేశాడు ప్రదీప్ వర్మ.. అయితే అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండటంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ప్రదీప్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో.. అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మగా గుర్తించారు.
నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం:
నేటి నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జాతర కొనసాగనున్నది. తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు హాజరుకానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అటవీ శాఖ ఆంక్షలతో తెలంగాణ అమర్నాథ్ యాత్ర జరగనున్నది. సలేశ్వరం జాతరకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని సూచించారు.
దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన:
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్ష ప్రభావం ఉంటుందని చెప్పింది. ఇక బెంగళూరులో ప్రస్తుతం వర్షపు జల్లులతో నగరం ముద్దవుతోంది. ఈరోజు, రేపు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 13 వరకు తేలికపాటి జల్లులు పడే ఛాన్సుందని చెప్పింది. ఉష్ణోగ్రత 21 డిగ్రీలకు పడిపోవచ్చని చెప్పింది. ప్రస్తుతం నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భార్యను చంపి భర్త ఆత్మహత్య:
మహారాష్ట్రలో దారుణంగా జరిగింది. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీధర్ రామచంద్ర జోషి(80) తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య లత (76)ను చంపి.. అనంతరం జోషి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు ఉపశమనం లభించిందంటూ ఒక సూసైడ్ నోట్ను రాసి పెట్టాడు. ఈ విషాద సంఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్లో జోషి(80), భార్య లత (76) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ముంబైలో స్థిరపడ్డారు. ఇక వృద్ధులను చూసుకోవడానికి కేర్ టేకర్ సీమా రాథోడ్ ఉంది. అయితే బుధవారం ఉదయం, మధ్యాహ్నం పని ముగించుకుని సీమా రాథోడ్ వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 7 గంటలకు వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఇద్దరు చనిపోవడం చూసి షాక్ అయింది. సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది.
నేడు కాశీలో ప్రధాని మోడీ పర్యటన:
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (ఏప్రిల్ 11న) వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆయన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకనున్నారు. ఇక, అక్కడి నుంచి మోడీ నేరుగా రాజతలాబ్లోని మెహందీగంజ్లో వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా రూ.3,884.18 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులను కాశీ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇందులో రూ.1629.13 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులను ప్రారంభించనుండగా.. మరో 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ.
చైనాపై 145 శాతం సుంకాలు:
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక, అగ్ర రాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్పై సుంకాలు పెంచేస్తుంది. ఇప్పటిదాకా చైనాపై విధించిన టారిఫ్ లను మొత్తంగా లెక్కిస్తే 145 శాతంగా ఉంటాయని యూఎస్ స్పష్టం చేసింది. అయితే, బుధవారం నాటికి 125 శాతమని ట్రంప్ పేర్కొనగా.. అది గురువారం వరకు 145 శాతానికి పెంచినట్లు వైట్ హౌస్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, భారత్పై విధించిన 26 శాతం అదనపు సుంకాల మినహాయింపు జులై 9వ తేదీ వరకూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. గతంలో అమల్లో ఉన్న 10 శాతం సుంకాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. అలాగే, చైనాపై మరింతగా పన్నులు పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.
న్యూయార్క్లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్:
అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. న్యూయార్క్ నగర మేయర్ ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. మృతుల్లో స్పెయిన్కు చెందిన పైలట్, ఒక కుటుంబం ఉన్నారు. బెల్ 206L-4 లాంగ్రేంజర్ IV హెలికాప్టర్ మాన్హట్టన్ నుంచి బయలుదేరి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చుట్టుముట్టి, హడ్సన్ నది వెంబడి ఉత్తరం వైపు జార్జ్ వాషింగ్టన్ వంతెన వైపు వెళ్లింది.
ఇట్స్ అఫీషియల్.. టబు ఆన్ డ్యూటీ:
వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఛార్మి కౌర్ నిర్మాతగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో టబూ లేదా రవినా టాండన్, ఇద్దరిలో ఒకరు కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఎట్టకేలకు టబూ ఫిక్స్ అయింది. ఆ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తూ, పూరి జగన్నాథ్, ఛార్మితో కలిసి టబూతో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ చెప్పిన లైన్ విని సేతుపతి బాగా ఎక్సైట్ అయ్యాడని, ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో టబూ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ మంచి కంబ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు:
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి, ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’ అని పేర్కొన్నారు.