ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం..!
విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారు చేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్లో మార్పులు చేపట్టారు.
46 ఏళ్ల తర్వాత సంభాల్లో హోలీ వేడుకలు.. భారీగా భద్రత..
హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు. ఇదిలా ఉంటే, 46 ఏళ్ల తర్వాత మొదటిసారిగా సంభాల్ ప్రాంతంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంభాల్లోని చారిత్మాత్మక కార్తికేయ మహాదేశ్ ఆలయంలో హోలీ వేడుకలు జరిగాయి. హోలీని శాంతియుతంగా జరుపుకోవడానికి భారీగా పోలీస్ బలగాలు మోరించాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 46 సంవత్సరాల తర్వాత కార్తికేయ మహాదేవ్ ఆలయంలో హోలీ ఆడే భాగ్యం మనకు లభించిందని ఆయన అన్నారు.
ఉమెన్ సేఫ్టీపై ఫోకస్.. 164 శక్తి టీమ్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇప్పటి వరకు ఉండేది.. ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాల్స్ వచ్చినపుడు రెస్పెన్స్ టైం వీలైనంత వేగంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. మరోవైపు.. శక్తి యాప్ కూడా అందుబాటులో ఉందని డీజీపీ హరీష్ కుమార్ చెప్పారు. మిస్సింగ్ చైల్డ్ గురించి కూడా ఈ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయి.. సైబర్ క్రైమ్స్ పరివేక్షణకు అధికారులతో ఒక వింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ తెలిపారు.
మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు.
“రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం మాకు తెలుసు. అయితే, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. తెలంగాణ ఆర్థికంగా ఎదిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవం కలిగినది, పాత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి.. హోంమంత్రి ఆగ్రహం
విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. వేపాడ మండలం గుడివాడ గ్రామంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళలపై తాగుబోతులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో.. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పైనా దురుసుగా ప్రవర్తించారు. ఇది క్షమించరాని నేరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో ఫోన్లో మాట్లాడి అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జాతర పేరుతో మహిళలపట్ల పోకిరీ వేషాలు వేస్తే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
అసెంబ్లీ సస్పెన్షన్ పై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోపారని ఆరోపించారు. “నేను స్పీకర్ పై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం చేసే తప్పులను బయటపెడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,” అని ఆయన ఆరోపించారు. జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “సభ 15 నిమిషాలు వాయిదా పడిన సమయంలో కేసీఆర్ మాకు ఫోన్ చేసి, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండమని, స్పీకర్ను విచారణకు కోరమని సూచించారు” అని తెలిపారు. తమ వ్యాఖ్యలు నిరూపించడానికి వీడియోలు చూపించడానికి కూడా సిద్ధమని చెప్పారు.
సత్తుపల్లి అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామంలో సీతారామ టన్నెల్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై విశేషాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, తాను రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్య కోసం పిల్లలు స్కూల్స్కు సులభంగా వెళ్లగలిగే పరిస్థితి రావడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీపీ కీలక సూచనలు…
35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసములోని రెండవ శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులకు కోరారు.
మందుబాబులకు బ్యాడ్న్యూస్.. రేపు వైన్స్ బంద్
గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
భాగ్యనగరంలో హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. రంగులు పూసుకుంటూ, కేరింతలు కొడుతూ, వీధుల్లో సందడి చేయడం సాధారణం. అయితే, కొన్ని ప్రాంతాల్లో మద్యం సేవించి అసభ్య ప్రవర్తనకు దిగే ఘటనలు జరుగుతుంటాయి. ఈ తరహా ఘటనలను అరికట్టే చర్యల్లో భాగంగా, హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ పండుగ రోజు, మార్చి 14 (శుక్రవారం) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లన్నీ మూసివేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమం చేసింది నేనే – కేసీఆర్కు తెలంగాణ సొంతం కాదు
తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్ఎస్పై, కేసీఆర్పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఓటుతో రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటుందన్న వాగ్దానాన్ని బీజేపీ తప్పించుకుందని, ఆ కారణంగా తాను ఆ పార్టీని వీడానని విజయశాంతి స్పష్టం చేశారు. “తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను బీజేపీ రాష్ట్రంలోకి రప్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని ఆమె హెచ్చరించారు.