మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారు
కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. కడుపున పుట్టినంత మాత్రాన రాజకీయ వారసత్వం రాదని ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో మా నాన్న డీఎస్ చేరినప్పుడు, ఓ అనుచరుడు గా మా నాన్న తో కలిసి వెళ్ళానని, ఏ రోజూ బీఆర్ఎస్ లో క్రీయశీలకంగా పనిచేయలేదన్నారు సంజయ్. నేను పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నన్ను కూడా సస్పెండ్ చేసిందని, నేనెప్పుడు కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.
సోనియా గాంధీ ని కలిసి ఆశీర్వదించాలని కోరానని, తప్పకుండా ఆశీస్సులు ఉంటాయని సోనియా గాంధీ చెప్పారన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత సోనియా గాంధీ ని ఈరోజు కలిశానని, నిజామాబాద్ మేయర్గా ప్రజల మనసుల్లో ప్రేమ, అభిమానం ఉందని ఆయన అన్నారు. తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారనే విశ్వాసం ఉందని, సోదరుడు అరవింద్ ఎంపీ గా గెలవడానికి అప్పటి పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు బాధ్యతలు ఇస్తే తప్పకుండా శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ఎన్నికల్లో పోటీ చేసే అంశం పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇంకా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈరోజు, రేపు కలుస్తానని ఆయన తెలిపారు.
మణిపూర్ అల్లర్లపై నిగ్గు తేల్చడానికి ముగ్గురు మాజీ మహిళా జడ్జిలతో కమిటీ
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జాతి హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను కూడా పరిశీలించేందుకు ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. కేవలం హింసాత్మక ఘటనలపై విచారణ చేయడంతో కమిటీ విస్తృతంగా విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిబిఐకి బదిలీ చేయని కేసులను 42 సిట్లు చూస్తాయని.. ఈ సిట్లను మణిపూర్ వెలుపల డీఐజీ ర్యాంక్ అధికారులు పర్యవేక్షిస్తారని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. ప్రతి పోలీస్ అధికారి ఆరు సిట్లను పర్యవేక్షిస్తారని.. దర్యాప్తు సరిగ్గా జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ‘‘మా ప్రయత్నాలు చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం. మేము ఒక స్థాయిలో ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ దర్యాప్తు మాత్రమే కాకుండా – సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ ప్రకటించారు. కమిటీలో జమ్ము అండ్ కశ్మీర్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆషా మీనన్ సభ్యులుగా ఉంటారని కోర్టు ప్రకటించింది.
పోలీసులకు వర్క్ ఫ్రం హోం అంట.. ఇది సాధ్యమయ్యేదేనా?
నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు సభలకు ప్రజలు రావడం లేదని.. అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తామని చెబుతున్నాడు.. ఇది సాధ్యమయ్యేదేనా అంటూ ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. జిల్లాలో నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. సోమశిల.. కండలేరులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని మంత్రి తెలిపారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వరద నీటిని పంపే కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచిన ఘనత తమదేనని ఆయన వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు డీజీపీగా పదోన్నతి
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన అధికారులను అదే పోస్టింగ్లలో కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఒక ఉత్తర్వులో, ముగ్గురు IPS బ్యాచ్లు CV ఆనంద్ (1991) రాజీవ్ రతన్ (1991) లతో పాటు డాక్టర్ జితేందర్ (1992)లకు డీజీలుగా పదోన్నతి లభించింది. అయితే.. ప్రస్తుతం సీవీ ఆనంద్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ పోలీస్ హౌంజిగ్ కార్పోరేషన్ ఎండీగా ఉన్నారు. అలాగే జితేందర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను డీఐజీలుగా ప్రమోషన్ కల్పించింది. అంబర్ కిషోర్ ఝా, రెమా రాజేశ్వరీ, ఎల్ ఎస్ చౌహాన్, కే. నారాయణ్ నాయక్, పరిమల హనా నూతన్ జాకబ్, ఎస్, రంగారెడ్డిలను డీఐజీగా ప్రమోట్ చేసింది.
రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ప్రారంభించనున్న రాహాల్ గాంధీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్తోపాటు .. బీఆర్ఎస్ కూడా మోడీపై అవిశ్వాసం కోసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోడీపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదిల్లో చర్చించడానికి గతంలోనే స్పీకర్ తేదిలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది.
మోడీ ఇంటిపేరు కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నాలుగు నెలల క్రితం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల జైలుశిక్షని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్ట్ స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియేట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం తిరిగి తన పార్లమెంటు సభ్యత్వాన్ని పొందారు. పార్లమెంటు సభ్యత్వం తిరిగి రావడంతో.. రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటుకు హాజరయ్యారు. మంగళవారంనాడు జరిగే అవిశ్వాస తీర్మానం చర్చలో రాహుల్ కీలకం కానున్నారు. మణిపూర్లోని హింసాత్మక ప్రాంతాలను రాహుల్ సందర్శించడం కూడా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఉపయుక్తంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గద్దర్ అంతిమయాత్రలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట వల్ల సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అంతిమ యాత్రలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్ మహాబోధి స్కూల్ వద్ద జనాలు ఎక్కువయి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. భారీ సంఖ్యలో చేరుకున్న గద్దర్ అభిమానులు.. స్కూల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినకుండా ముందుకు భారీగా తోసుకు రాగా అక్కడి తొక్కిసలాటలో ఓ వ్యక్తి చనిపోయారు. అయితే పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిజానికి జనాల మధ్యలో నీరసంతో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ , సీనియర్ జర్నలిస్ట్ పడిపోయారు.
పోలీసులు తొక్కిసలాట అనంతరం ప్రభుత్వం స్థానికంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు డాక్టర్ల దగ్గరకు తీసుకు వెళ్లగా జహీరుద్దీన్ చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్ వయస్సు 63 సంవత్సరాలు. ఇక అక్కడి సమాచారం మీకు ఆయన గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం నుంచి డీసీఎం వెహికిల్ లోనే ఉన్నారని మధ్యలో ఒకసారి దిగి.. మళ్లీ ఎక్కారని అంటున్నారు. అయితే గద్దర్ ఇంటి వద్దకు రాగానే.. వెహికల్ దిగడానికి ప్రయత్నించి అలా కుదరక పోవడంతో వెంటనే కింద పడ్డాడు. అప్పుడే తోపులాట జరిగిందని ఈ తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటుతో చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆయన మృతికి పలు జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో డెంగ్యూ డేంజర్.. వారంలో 105 కేసులు నమోదు
కొద్ది రోజుల వరకు డిల్లీని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తగా.. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఢిల్లీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వరదల, నీటి నిల్వ కారణంగా దోమలు ఎక్కువగా వృద్ది చెంది దోమల మూలంగా వచ్చే వ్యాధులు, సీజన్ వ్యాదులు వ్యాప్తి చెందుతున్నాయి. వారం రోజుల్లోనే 105 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వరదనీరు తగ్గుముఖం పట్టడంతోపాటు వివిధ ప్రాంతాల్లో నీటి మడుగులు నిలిచిపోవడంతో రోగాలను వ్యాపింపజేసే దోమలు వృద్ధి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూ, చికున్గున్యా, జికా వైరస్లను వ్యాప్తి చేసే ఏడిస్ దోమల వ్యాప్తికి ఈ పరిస్థితులు అనువైనవని ఆరోగ్య నిపుణులు నొక్కి చెప్పారు. గత వారంలో మలేరియా మరియు చికున్గున్యా కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజుల్లో 13 మలేరియా కేసులు , 85 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 15 చికున్గున్యా కేసులు నమోదయ్యాయి.
ప్రజాగాయకుడు అస్తమయం.. బౌద్ధ ఆచారం ప్రకారం గద్దర్ అంత్యక్రియలు
అమ్మా తెలంగాణమా అంటూ అణువనువును తట్టిలేపిన ఆ స్వరం ఇక సెలవు తీసుకుంది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. తెలంగాణ గోసకు పతాకమైన నిలిచి ఆ గానం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన మాట, పాట, ఆటలతో.. మాటలనే పాటలుగా మలిచి ఉర్రూతలూగించిన ప్రజా యుద్ధనౌక ప్రస్థానం ముగిసిపోయింది. బండెనక బండి కట్టి తరలొచ్చిన ప్రజాగాయకుడి అభిమానలోకం.. వాలిపొతున్న పొద్దుకు విప్లవజోహార్లంటూ కన్నీటి వీడ్కోలు పలికింది. సికింద్రాబాద్ అల్వాల్లోని మహాబోధి విద్యాలయంలో బౌద్ధమత ఆచారం ప్రకారం ప్రజాయుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూపుకోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. గద్దర్కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాలలోనే అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో అభిమానులు, మంత్రులు, పలు పార్టీల నాయకులు, కళాకారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు సీఎం జగన్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపు లంకకు సీఎం చేరుకోనున్నారు.
వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం రామాలయంపేట గ్రామం తానేలంకకు సీఎం జగన్ చేరుకోనున్నారు. అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేటలో బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. వారి గోడును తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.