వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు:
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నేడు అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్:
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వివాహిత మహిళలకు ఇచ్చే మెటర్నిటీ లివ్ (ప్రసూతి సెలవులు)లను చంద్రబాబు సర్కార్ పొడగించింది. మెటర్నిటీ లివ్లను 120 నుంచి 180కి పెంచింది. అంతేకాదు ఇద్దరు పిల్లకు మాత్రమే లివ్లు వర్తింపు అనే నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించింది. మెటర్నిటీ లివ్లను 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుకోగా.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కేసులకు భయపడే కాకాణి పరారయ్యారు:
వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాత్ర గురించి అందరికీ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారని, బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా? అని అన్నారు. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని ఎమ్మెల్సీ బీదా తెలిపారు.
సమరం కాదు.. సమయ స్పూర్తి అవసరం:
నేడు హైదరాబాద్ లో ప్రముఖ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఈ సమరాలు ప్రజల మీదే అవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మూడున్నర లక్షల మంది, మీరు చేపట్టిన సమరం 97 శాతం ప్రజల మీదేనా? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు లేకపోతే ప్రభుత్వం ముందుగానే చొరవ తీసుకుని చెల్లింపులు ప్రారంభించిందని అన్నారు. పదవీకాలాన్ని 61 ఏళ్లకు పెంచాం, కానీ అందుకు అనువైన లాభాలు ఇవ్వకుండా ఉండేందుకు కాకుండా, ఉద్యోగుల ప్రయోజనాల కోణంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు. ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న 9 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వాల వల్ల పెండింగ్ అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు.. ‘సమరం’ అంటూ పోరాటానికి దిగుతారంటే ఆ పోరాటం ఎవరి మీద? అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు. విషయం ఏమైనా ఉంటే చర్చకు రండి, ప్రజల మీద యుద్ధం చేయవద్దు అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.
పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు:
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలో భాగస్వాములు అవుతున్న మిస్ వరల్డ్ – 2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నట్లు I&PR విభాగం అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్ పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి, దాని సంక్లిష్టమైన ఇక్కత్ నేత పద్ధతులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. పోచంపల్లిని యునెస్కో “ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామం”గా గుర్తించింది. ఇది చేతిపనులు, సంస్కృతి, వారసత్వానికి సజీవ మ్యూజియం.
ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు:
గోదావరి ఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నక్సల్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కులగణన తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు. వారు దశాబ్దాలుగా నక్సల్స్ పక్షాన నిలబడి, అమాయకుల చావులకు కారణమైన విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఆ చావులకు మీరు ఏమి సమాధానం చెబుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీతో రక్షణశాఖ కార్యదర్శి కీలక భేటీ:
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. అలాగే, తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇవాళ (మే 5న) రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రధాన మంత్రి- రక్షణ శాఖ ఉన్నతాధికారుల మధ్య జరిగిన మూడవ అత్యున్నత స్థాయి మీటింగ్ అని చెప్పొచ్చు.
రక్షణ వెబ్సైట్ పై పాక్ సైబర్ దాడి:
దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ దాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన భౌతిక సరిహద్దుల్లోనే కాక, డిజిటల్ రంగంలో కూడా ఉద్రిక్తతలను రగిల్చింది. పాకిస్థాన్ హ్యాకర్లు భారత రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతూ, దేశ రక్షణ వ్యవ్యస్థకి సవాలు చేస్తున్నారు. అయితే, భారత సైబర్ రక్షణ ఏజెన్సీలు ఈ దాడులను దీటుగా ఎదుర్కొంటూ, దేశ భద్రతను కాపాడుతున్నాయి.
120 కిమీ రేంజ్ క్షిపణి ప్రయోగించిన పాకిస్తాన్:
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఒక్కసారిగా ఉద్రిక్త స్థితికి చేరాయి. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న కఠిన చర్యలు పాకిస్తాన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ ఎప్పుడైనా సైనిక దాడికి పాల్పడవచ్చనే భయంతో పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, మే 5, 2025న పాకిస్తాన్ తన ‘ఫతే’ క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. గత మూడు రోజుల్లో ఇది రెండో క్షిపణి పరీక్ష కావడం దృష్ట్యా, ఈ చర్య భారత్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో జరిగినట్లు స్పష్టమవుతోంది.
కేవలం రూ. 6,499కే 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల HD+ డిస్ప్లే:
దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) తాజాగా తన బడ్జెట్ స్మార్ట్ఫోన్ లైనప్లో భాగంగా Lava Yuva Star 2 మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన యువా స్టార్కు ఇది సక్సెసర్గా వస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో, అత్యంత సమర్థవంతమైన ధరలో అందుబాటులోకి వచ్చింది. మరి ఇంత తక్కువ ధరలో యిలాంటి ఫీచర్లను అందిస్తుందో ఒకసారి చూద్దామా. Lava Yuva Star 2 స్మార్ట్ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. 2.5D గ్లాస్తో 60Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ను ఆక్టా-కోర్ UNISOC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇందులో 4GB RAM, అదనంగా 4GB వర్చువల్ RAM కూడా ఉంది. ఫోన్లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 512GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. లావా ఈ ఫోన్ను ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్ మీద నడుపుతోంది. ఈ ఫోన్లో 13MP మెయిన్ కెమెరా, AI కెమెరా, LED ఫ్లాష్ తో కలిపి ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.
టీవీఎస్ మోటార్ నుండి మరో కొత్త బడ్జెట్ బైక్:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ బడ్జెట్ సెగ్మెంట్లో తమ శ్రేణిని విస్తరించింది. ఇప్పటికే అత్యధిక అమ్మకాలు, తక్కువ ధరలతో వినియోగదారుల మన్ననలు పొందిన TVS స్పోర్ట్ మోడల్లోకి తాజాగా ES+ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో టీవీఎస్ మోటార్ అందించే అత్యంత తక్కువ ధర గల మోటార్ సైకిల్గా TVS Sport గుర్తింపు పొందింది. ఇది TVS Star City+, TVS Raider 125 మోడళ్ల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. తాజాగా విడుదలైన ES+ వేరియంట్ ధర కేవలం రూ. 60,881 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించబడింది. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న TVS స్పోర్ట్ ES వేరియంట్ ధర రూ. 59,881 కాగా, ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉండి కూడా అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. టాప్ ఎండ్ మోడల్ అయిన ELS వేరియంట్ ధర రూ. 71,785 గా ఉంది.
‘ఆదిపురుష్’ విషయంలో అందుకే సారీ చెప్పా:
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రీసెంట్ గా ఓ కామెంట్ చేశాడు. ప్రభాస్ తో తాను కలిసి నటించిన ఆదిపురుష్ సినిమాను తన కొడుకు తైమూర్ కు చూపించి సారీ చెప్పానని అన్నాడు. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరేమో సైఫ్ కు సపోర్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పించారు. తన కొడుకుకు అలా సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. ‘నేను ఆదిపురుష్ లో విలన్ గా చేశాను. అందులో కొంత భయపెట్టేలా కనిపిస్తాను. అందరితో యుద్ధాలు చేస్తాను. ఆ సినిమా నా కొడుకుకు చూపించాను. నువ్వు ఇలాంటి సినిమాలో హీరోగా చేయాలి. విలన్ గా చేయొద్దు అన్నాడు. సరే అని చెప్పాను’ అంటూ సైఫ్ చెప్పాడు.
సమంత సినిమా చేస్తే… సౌండ్ ఏది?:
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు, ఇటీవల నటన పరంగా కాస్త వెనుకబడిన సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్పై తొలి చిత్రంగా ‘శుభం’ సినిమాను నిర్మించిన సమంత, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం చాలా మందికి తెలియకపోవడం ఆశ్చర్యకరం. నిజానికి సమంత గత 15 ఏళ్లుగా తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర నటిగా రాణించింది. ఎన్నో సినిమాలతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
‘పెద్ది’ ఫస్ట్ షాట్ ను వాడేసిన ఢిల్లీ టీమ్:
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మొన్న వచ్చిన ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. అసలే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ను చాలా మంది వాడేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఏకంగా పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసేసింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఢిల్లీ మ్యాచ్ ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్లేయర్స్ తో పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసిన వీడియోను పోస్టు చేసింది. యుద్ధానికి తాము రెడీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై తాజాగా రామ్ చరణ్ స్పందించాడు.
దిగ్వేశ్ రాఠీకి మరో షాక్ తప్పదా?:
పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా దిగ్వేశ్ రాఠీ ‘నోట్బుక్’ సంబరాలు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను 13వ ఓవర్లో దిగ్వేశ్ ఔట్ చేశాడు. ఈ సీజన్లో అయ్యర్ను దిగ్వేశ్ అవుట్ చేయడం ఇదే మొదటిసారి. కీలక వికెట్ పడడంతో దిగ్వేశ్ నోట్బుక్ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు నోట్బుక్ సంబరాలు చేసుకుని జరిమానా ఎదుర్కొన్నా.. మరోసారి అలానే చేశాడు. దిగ్వేశ్ మూడోసారి జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.