తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ ఆగ్ని ప్రమాదం..
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కాలిపోయినట్లు సమాచారం. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్లో 5 యూనిట్ల ద్వారా మొత్తం 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అగ్ని ప్రమాదం కారణంగా మూడు యూనిట్లలో 630 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండు నెలలుగా స్టాలిన్ వితండవాదం చేస్తున్నాడు..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, డీఎంకే దివాలు కోరు రాజకీయం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం ఓడిపోతుంది.. తమిళనాడు ప్రజలు స్టాలిన్ కుటుంబానికి వ్యతిరేకంగా మారారని అన్నారు. దానిని కప్పి పుచ్చుకోవడానికి కొత్తగా తెర మీదికి తీసుకొస్తున్నారని వెల్లడించారు. తమిళనాడులో సంక్షేమ పథకాలను అందించే విషయంలో విఫలం అయ్యారు.. వీటి నుండి తప్పించి కోవడానికి మోదినీ భూచీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!
పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని.. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్నారు. వేంపల్లి పంచాయితీలో పని చేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారని, జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు రవి శంకర్ రెడ్డి రూ.52 లక్షలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవం కాదా? అని రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు.. కేసీఆర్కి నేనేమీ తక్కువ కాదు అన్నట్లు రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు.
పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
పాకిస్తాన్ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ సిబ్బందిని చింపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.
ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా?
సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు వంటి ప్రముఖుల పేర్లు తొలగించే ధైర్యం ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు దేశభక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి అని, ఆయన హరిజనుల ఆలయ ప్రవేశం కోసం పోరాడిన మహనీయుడు అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని అవమానించడం తగదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి, ఆర్యవైశ్య వ్యతిరేకి అని ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి రూ. 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్ను హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన సీఎం, రాష్ట్రంపై భారీగా పెరిగిన అప్పులను ప్రస్తావించారు. రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలను బీజేపీ-బీఆర్ఎస్ పాలన నుంచి వారసత్వంగా అందుకున్నామని, ఈ మొత్తంలో కేవలం రూ. 1.53 లక్షల కోట్లు మాత్రమే చెల్లించారని వివరించారు. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 1.50 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని చెప్పారు. రైతులకు రుణమాఫీ కింద రూ. 20,610 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
బీఆర్ఎస్పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ దోచుకున్న డబ్బులతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్లు బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ను రెండు సార్లు తిరస్కరించారని స్పష్టం చేశారు. అయినా వాళ్లకు బుద్ధి రావట్లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇది ధనిక రాష్ట్రమని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. అసలు నిజాలు బయటపడతాయని భయపడి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా వెనుకడుగేస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో బీఆర్ఎస్ శాసన సభ్యులు ఎప్పటికీ మారని దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు తాము చెప్పినదే నిజమని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ
బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చిన అందులో కొన్ని మాత్రం ఏళ్ల తరబడి నడుస్తూ నెంబర్ వన్ షోలుగా వెలుగొందుతున్నాయి. అందులో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యావహరిస్తున్నా ఈ షో దాదాపు 25 ఏళ్లుగా భారతీయులను ఆకట్టుకుంటోంది. మొత్తం 16 సీజన్ల పాటు, నిరాటంకంగా రన్ అవుతున్న ఈ షో తో.. అమితాబ్ బచ్చన్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. దీంతో ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి ఒకింత కారణం అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఈ షో కు బిగ్ బీ గుడ్ బాయ్ చెబుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఈ వార్తలపై అమితాబ్ బచ్చన్ స్పందించాడు.
హాస్పిటల్ బెడ్ పై సమంత ?
తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ను ప్రారంభించింది. ఈ బ్యానర్పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది సామ్. అందులో సామ్ హాస్పిటల్ బెడ్పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు సమ్కు మళ్ళి ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రజంట్ ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.