రాష్ట్రానికి వస్తున్న మోడీ గారు.. ప్రజా పక్షాన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్ ట్విట్
పిరమైన ప్రధాని @narendramodi గారు.. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొన్ని ప్రశ్నలను సంధించారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండని తెలిపారు. శాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!! అన్నారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..!! అని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు.. ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి..!! అన్నారు. మా యువతకు ఉపాధినిచ్చే…కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండన్నారు.
తెలంగాణలో 14 ఎంపీ సీట్లు మా టార్గెట్..
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్వే పోటీ ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్యే పోరు కొనసాగనుందన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోతుంది.. ఇక, పరోక్షంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు గెలడమే మా టార్గెట్ అన్నారు. 100 రోజుల పాలనను చూసి తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39. 50 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ లోక్ సభ ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగిన లేదా తగ్గకున్నా మేం పాసైనట్లే.. రెఫరెండం అంటే అదీ అని చెప్పుకొచ్చారు. అలాగే, కేవలం 100 రోజుల్లోనే అన్నీ అయిపోవాలంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
వైసీపీ రెబల్స్పై మంత్రి రోజా ఫైర్..
మంత్రి ఆర్కే రోజా.. మరోసారి నగరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెబల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు.. అయితే, రెబల్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారన్న ఆమె.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు. కానీ, జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయని సూచించారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 14 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో వారంలో కవితపై ఈడీ ఛార్జ్షీటు దాఖలు చేయనుంది. ప్రత్యేక న్యాయస్థానానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. 60 రోజుల్లోగా విధిగా ఈడీ ఛార్జ్షీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. బలమైన కారణాలుంటే.. అదనంగా మరో నెల ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు సమయం పొడిగించవచ్చు. మొత్తం కలిపి 90 రోజుల్లోగా ఛార్జ్షీటు దాఖలు చేయకపోతే.. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు అవుతుంది.
అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వైరా శాస్తా నగర్ లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు, మాజీమంత్రి కాకతీయ వంశస్థులు కమల్ మంజు దియా కాకతీయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షో ప్రారంభం సందర్భంగా డప్పు వాయించారు వినోద్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా పొంగిలేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే అని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని, పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి 400 సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద రావు సునాయాసంగా గెలుస్తారని, తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి.
మూడుసార్లు సీఎంగా చేసి ప్రజల్ని మోసం చేసారు..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే విధంగా రూ.700 కోట్ల త్రాగునీటి ప్రాజెక్ట్ చేపట్టామని సీఎం చెప్పారు. అంతేకాకుండా.. రూ. 80 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసామని.. 4 మెడికల్ కళాశాలలు కడుతున్నామని అన్నారు. కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని.. నాలుగు వందల కోట్లతో నాలుగు వందల సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేసామని సీఎం జగన్ తెలిపారు.
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు దీంతో కొంత ఉపశమనం లభించింది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ధాన్యం తడిసిముద్దయింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభకోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో టెంట్ల కింద కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఏపీలో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం
తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు సేద దీరారు. భారీ వర్షానికి కార్లు, బైక్లు నీటిలో కొట్టుకుపోయాయి. పది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కంభాల చెరువు వద్ద వర్షపు నీటిలో చిక్కుకుంది. అంతేకాకుండా.. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు నేలకు ఒరగడంతో విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపడ్డాయి.
కావాలనే రైతు భరోసా విడుదలను అడ్డుకుంటున్నారు
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్లు ఓర్చుకోలేక పోతున్నాయనీ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందరికీ రైతు భరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు దానిని అడ్డుకున్నాయన్నారు. నిన్న ఒక్కరోజే 900 కోట్లు రైతుల ఖాతాలో వేసామన్నారు..రైతు భరోసా ను ఆపాలని ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేశాయనీ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల వరకు రైతు భరోసా ఆపాలని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పడంతో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్..
సోమవారం ప్రధాని మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకడు తానా అంటే.. ఇంకొకడు తందనా అంటున్నారని దుయ్యబట్టారు. మోడీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయాడని మంత్రి పేర్కొన్నారు.