*జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. పబ్ లు, క్లబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రి ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు చెప్పారు. ఈ క్రమంలోనే జనవరి 1న తెలంగాణ సర్కార్ సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1ని జనరల్ హాలిడేగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లే వారు, పబ్లు, క్లబ్లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు ఇచ్చారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా చూసుకోవాలి.. ఒకే వేళ డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
*నెట్టింట వైసీపీ-టీడీపీల మధ్య ‘డంకీ’ పోస్టర్ వార్
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది. ‘డంకీ’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను వాడుకుని ఇరు పార్టీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ పోస్టర్లను ట్విట్టర్లోని తమ అధికారిక హ్యాండిళ్లలో పోస్ట్ చేశాయి.
టీడీపీ ముందుగా..
టీడీపీ ముందుగా డంకీ పోస్టర్ను వైసీపీ నేతల ముఖాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దీని క్యాప్షన్గా “2024 ఎన్నికల ఫలితాలకు ముందే సైకో వైకాపా బ్యాచ్ అంతా విదేశాలకు పారిపోవడానికి లగేజీ సర్దుకుంటున్నారు.” అని రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో JUMPI-AFTER 2024 Elections అని టైటిల్ను యాడ్ చేసింది టీడీపీ. ఈ పోస్టర్పై సీఎం జగన్, మంత్రి రోజా, మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ముఖాలను చేర్చింది. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఈవిధంగా..
దీనికి ప్రతిస్పందించిన వైసీపీ కూడా టీడీపీ నేతల ముఖాలతో డంకీ పోస్టర్ను ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దీని క్యాప్షన్గా.. “పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పచ్చ హమాస్ బ్యాచ్ మన రాష్ట్రం నుంచి తరలిపోయే రోజు త్వరలోనే రానుంది.” అని రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో “JUMPING JAPANG” అని టైటిల్ను యాడ్ చేసింది వైసీపీ. ఈ పోస్టర్పై నారా లోకేష్, రామోజీ రావు, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ముఖాలను చేర్చింది. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వర్సస్ టీడీపీ, జనసేన మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది.
*లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి!
లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ సాగింది. చేవెళ్ల లోక్సభ రివ్యూ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ… ‘లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. నియోజక వర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇంచార్జిలుగా ఉంటారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. బీజేపీ ధీటుగా ఉంటది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా పోటీ ఇస్తారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా ముందుకు సాగాలి’ అని అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… ‘నన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యం. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతాము’ అని చెప్పారు.
*దివ్యాంగులకు రూ. 4 వేల పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్
దివ్యాంగులకు గత ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్.. జిల్లాలో కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకి 6 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని వికలాంగుల పక్షాన ప్రభుత్వాన్ని హరీశ్ రావు కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక వికలాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్నారు అని హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 400, 700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదు అని విమర్శించారు. కొంత మంది మానసిక దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి వారు నా దృష్టిలో మనుషులే కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. మానసిక దివ్యాంగుల అవసరాల కోసం నా జీతం నుంచి కొంత ఆర్థిక సాయం చేస్తాను.. కంటి సమస్యలు పరిష్కారం అయ్యేలా సిద్దిపేటలోనే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని ఏర్పాటు చేశాం.. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.. అభయ జ్యోతి శాశ్వత భవన నిర్మాణానకి తన వంతు సహకారం అదజేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.
*పవన్కు ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు’ పరిస్థితి..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హాట్ కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ‘పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు’ అనే పరిస్థితి పవన్ కల్యాణ్కు వస్తుందంటూ జోస్యం చెప్పారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల పరిపాలనలో చాలా అవినీతి చేశాడని ఆరోపించారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అందుకే మేం గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. మీకు ఎలాగు పరిపాలన చేతకాలేదు, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను అని వ్యాఖ్యానించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. గతంలో.. పవన్పై విమర్శలు చేసిన పాల్.. ఈ సారి.. జయమాలిని అప్పట్లో డాన్స్ చేసి మెప్పించిన ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నాడు వదిలేశాడు..’ పాట గుర్తు చేస్తూ.. పవన్ కల్యాణ్పై సెటైర్లు వేశారు. కాగా, ఈ మధ్య పవన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడిన విషయం విదితమే.. పవన్ కల్యాణ్కి తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేసిన ఆయన.. తెలంగాణ ప్రజలు పవన్ కల్యాణ్ను తరిమి తరిమి కొట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, విశాఖపట్నం వచ్చి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని.. ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోవాలి.. నువ్వు ప్యాకేజీ స్టార్వి.. ఆయన పార్టీ అవినీతి పార్టీ అంటూ కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. అయితే, ఈ రోజు విశాఖపట్నంలోని అసిల్మెట్టలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కేఏ పాల్.. నిరుపేదలకు, చిన్నారులకు చీరలు, బ్లాక్కెట్స్, ఫుడ్ పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా పవన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
*దేశంలో 63 కొత్త వేరియంట్ కేసులు.. టాప్లో గోవా, తెలంగాణలో కూడా నమోదు..
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ఆదివారం రోజు దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉంటే.. సోమవారం 4054కి యాక్టీవ్ కేస్ లోడ్ పెరిగింది. తాజాగా దేశంలో విస్తరిస్తున్న JN.1 వేరియంట్ ఓమిక్రాన్ వేరియంట్కి వారసుడిగా చెబుతున్నారు. అయితే దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవని, చాలా సందర్భాల్లో రోగులు ఇంటి వద్దే సాధారణ లక్షణాల నుంచి కోలుకుంటుంటారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 4054 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఒక్క కేరళలోనే 128 యాక్టీవ్ కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 73, మహారాష్ట్రలో 50, రాజస్థాన్ లో 11, తమిళనాడులో 9, తెలంగాణలో 8 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మరణాల సంఖ్య 5,33,334కి చేరుకుంది. తాజా ఇన్ఫెక్షన్లతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,09,248)కి చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 315 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది.
*వికటించిన క్రిస్మస్ విందు… 700 మంది అస్వస్థత
ప్రపంచమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మునిగిపోయింది. సెమి క్రిస్మస్ అంటూ నెల రోజులు ముందు నుంచే సెల్రబేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేశారు. కంపెనీ సమీపంలోని ఓ రెస్టారెంట్ గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారి కోసం రకరకాల నోరురించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. అయితే, విందు అనంరతరం దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ బస్ అట్లాంటిక్ తమ ఉద్యోగులకు మెరుగైన వైద్య ఏర్పాట్లు చేసింది. వారంత వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ (ARS) ధృవీకరించింది. ఆహారం నాణ్యత లోపం వల్లే తమ వారు అస్వస్థకు గురయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సదరు రెస్టారెంట్పై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పశ్చిమ ఫ్రాన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. విందులో ఏ రకమైన ఆహారాన్ని అందించారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.
*”ట్రాన్స్జెండర్ లవ్ స్టోరీ”.. ప్రేమను ఒప్పుకోలేదని నందిని దారుణ హత్య..
తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతుల్ని కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దళంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది. మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్గా మారి తన పేరును వెట్రిమారన్గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశారు. అప్పటి నుంచి నందిని, వెట్రిమారన్ నుంచి తప్పించుకు తిరుగుతోంది. నందిని రాహుల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందని వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లాడు. వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొనుక్కొచ్చి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
*ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయల శాంతాక్లాజ్..
క్రిస్మస్ పేరు వినగానే బహుమతులు, కేక్, శాంతాక్లాజ్ గుర్తొస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా క్రిస్మస్ తాతకు ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే సీక్రెట్గా బహుమతులు, స్వీట్స్, చాక్లెట్స్ ఇచ్చేది ఈ క్రిస్మస్ తాతే. అందుకే క్రిస్మస్ సందర్భంగా ఇతరులకు సాయం చేయాలనుకునేవారు శాంతాక్లాజ్ అవతారం ఎత్తుతారు. సీక్రెట్గా బహుమతులు ఇచ్చి హెల్ప్ చేస్తుంటారు. క్రిస్మస్ పండుగలో అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ తాతను ఉల్లి, ఇసుకతో ప్రదర్శించాడు ఓ ప్రఖ్యాత శిల్పి. క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్తో ద్వారా ప్రజలకు తనదైన శైలిలో సందేశం ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి అయిన సుదర్శన్ పట్నాయక్.. బ్లూ ఫ్లాగ్ బీచ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్ను రూపొందించారు. ఉల్లిపాయలు, ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్ని తీర్చిదిద్దారు. ఈ శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతో పాటు ఈ పండుగకు చెట్లను బహుమతిగా ఇచ్చి భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. కాగా ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది.