Rajput Issue:రాజ్పుత్ వర్గం బీజేపీపై మండిపడుతోంది. అయితే, ఈ కోపాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. క్షత్రియ సామాజికవర్గంలో బీజేపీపై నెలకొన్న కోపాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. వీరిని ఫతేపూర్ సిక్రీ, ఆగ్రాలో ప్రచారానికి బీజేపీ పంపుతోంది. రాజ్పుత్పై కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, సీట్ల పంపిణీపై అసంతృప్తి ఆ కమ్యూనిటీలో బీజేపీపై ఆగ్రహాన్ని పెంచాయి. ఫతేపూర్ సిక్రీలో సంఖ్యాపరంగా వీరి ఓట్లు ఎక్కువగా ఉండటంతో, అసంతృప్తిని చల్లార్చే పనిని బీజేపీ ప్రారంభించింది. ఫతేపూర్ సిక్రీ నుంచి బీజేపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా జాట్ నాయకుడు రాజ్ కుమార్ చాహర్ని రంగంలోకి దించింది. మరోవైపు ఇండియా కూటమి క్షత్రియుడైన రామ్ నాథ్ సికార్వార్ని ఈ స్థానంలో పోటీకి నిలబెట్టింది.
Read Also: Prajwal Revanna scandal: సెక్సు టేపులపై తొలిసారిగా స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ..
బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. మే 3న ప్రియాంకా గాంధీ సికార్వార్ తరుపున ప్రచారం నిర్వహించబోతున్నారు. సికార్వార్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. స్థానికులు ఇచ్చే విరాళాలను ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు. బీఎస్పీ తరుపున బ్రాహ్మణ వర్గానికి చెందిన రామ్ నివాస్ శర్మ పోటీ చేస్తున్నారు. మే 7న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో గణనీయంగా రాజ్ పుత్ వర్గం ఓటర్లు ఉన్నప్పటికీ, గత 15 ఏళ్లుగా ఆ వర్గానికి బీజేపీ టికెట్ ఇవ్వలేదని క్షత్రియుల తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఠాకూర్ పురాన్ సింగ్ అన్నారు. ఫతేపూర్ సిక్రీలో దాదాపు 3.50 లక్షల మంది క్షత్రియ ఓటర్లు ఉన్నారు. గెలుపోటములను వీరే డిసైడ్ చేయనున్నారు.
మరోవైపు రాజ్ పుత్ ప్రాబల్యమున్న ఘజియాబాద్లో రాజ్ పుత్ వర్గానికి చెందిన వీకే సింగ్ని కాదాని బనియా వర్గానికి చెందిన ఏకే గార్గ్కి బీజేపీ టికెట్ ఇవ్వడం కూడా వివాదం మరింత ముదరడానికి కారణమైంది. సైన్యంలో అగ్నివీర్ పథకం, EWS సడలింపు రాజ్ పుత్ ఆగ్రహానికి కారణమవుతోంది. రాజ్ కోట్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న పురుషోత్తం రూపాలా ఓ దళిత కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహారాజులు తమ కుమార్తెలను బ్రిటిష్ వారికి ఇచ్చి వివాహం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రూపాలా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినప్పటికీ.. గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ యూపీల్లో బలంగా ఉన్న రాజ్పుత్లో ఆగ్రహం నెలకొంది.