TMC Rebellion: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో ఊహించని షాక్ తగిలింది. మొన్నటికి మొన్న రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు ఆ సెగ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్కు తాకింది. టీఎంసీకి చెందిన 28 మంది లోక్సభ ఎంపీలలో ఏకంగా 20 మంది ఎంపీలు పార్టీ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమికి మద్దతు ఇవ్వాలని వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో విపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హాజరైన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ తిరుగుబాటు వర్గానికి నేతృత్వం వహిస్తున్న లోక్సభ ఎంపీ కాకలి ఘోష్ దస్తీదార్ తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. తమతో పాటు దాదాపు 20 మంది ఎంపీలు ఇదే నిర్ణయంతో ఉన్నారని, ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సైతం రాసినట్లు ఆమె వెల్లడించారు. అయితే తాము ప్రస్తుతానికి బీజేపీలో చేరడం లేదని, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసమే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ తిరుగుబాటు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ వాదనను వినిపించేందుకు సమయం కోరుతున్నారు. ముఖ్యంగా లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్గా కాకలి ఘోష్ దస్తీదార్ను కొనసాగించాలనేది వారి ప్రధాన డిమాండ్. కానీ, అధికారిక టీఎంసీ వర్గం మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చింది. కాకలి ఘోష్ను ఆ పదవి నుంచి ఎప్పుడో తొలగించామని, ఆమె స్థానంలో కళ్యాణ్ బెనర్జీని కొత్త చీఫ్ విప్గా నియమించామని మమతా వర్గం చెబుతోంది. ఈ మార్పునకు సంబంధించి మే 20వ తేదీనే, అంటే ఈ తిరుగుబాటు ఊసే లేనప్పుడే, లోక్సభ సెక్రటేరియట్కు అధికారిక లేఖ పంపినట్లు మమతా వర్గం స్పష్టం చేసింది. మే 29 నాటి స్పీకర్ కార్యాలయ రిసీవ్డ్ స్టాంప్ ఉన్న లేఖ కాపీలను సైతం పార్టీ వర్గాలు బయటపెట్టాయి. ఈ వాదనను ఎంపీ కీర్తి ఆజాద్ సైతం సమర్థించారు. కళ్యాణ్ బెనర్జీ నియామకం గురించిన సమాచారం గత నెలలోనే స్పీకర్కు చేరిందని తెలిపారు. ఇప్పుడు స్పీకర్ ముందు తలెత్తబోయే ప్రధాన వివాదం ఈ ‘చీఫ్ విప్’ పదవి గురించే కానుంది.
ఇక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఈ తిరుగుబాటు ఎంపీలు పక్కా స్కెచ్ వేశారు. అందుకే వారు నేరుగా టీఎంసీకి రాజీనామా చేయడం కానీ, లేదా బీజేపీ కండువా కప్పుకోవడం కానీ చేయట్లేదు. పార్లమెంట్లో ఒక ప్రత్యేక గ్రూప్గా ఏర్పడి, బయట నుండి ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు. బసిర్హాట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ప్రస్తుతం టీఎంసీకి లోక్సభలో 28 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ చట్టప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మూడింట రెండు వంతుల (2/3) మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుత సమీకరణాల ప్రకారం 20 మంది ఎంపీలు తిరుగుబాటు బాట పట్టడంతో, వారు ఆ సురక్షిత సంఖ్యను చాలా సులువుగా దాటేశారు. కాబట్టి వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం మమతా బెనర్జీకి అంత తేలిక కాదు.

