Kolikapudi Srinivasa Rao: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరువూరు పట్టణం 17వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. టీడీపీకి ఓటేసి గెలిపించాలని.. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హమీ ఇస్తున్నారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మీడియా సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తిరువూరు పట్టణంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తన దృష్టికి స్థానిక ప్రజలు పలు సమస్యలను తీసుకొచ్చారన్నారు. తిరువూరుని రెవెన్యూ డివిజన్గా ప్రకటించి ఆర్డీవో కార్యాలయం తిరువూరులో పెట్టారు.. కానీ రవాణా శాఖకు సంబంధించి ఆర్టీవో కార్యాలయం తీసుకుపోయి తిరువూరుకు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న గన్నవరంలో పెట్టారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం తీసుకుపోయి మైలవరంలో పెట్టారన్నారు. తిరువూరు ప్రజలు ఆయా శాఖల పని కావాలంటే గన్నవరం, మైలవరం వెళ్లవలసి వస్తుందన్నారు. తిరువూరు ప్రజలందరు తిరువూరు నుండే పరిపాలన సాగాలని తీర్మానించుకున్నామన్నారు. రేపు ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు శాసన సభ్యుడిగా ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో తిరువూరులో రెవెన్యూ డివిజన్గా రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అన్ని తీసుకువచ్చి తిరువూరుని పరిపాలన కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.