Terrorists arrest: భారత్ సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్లో చొరబడేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి వేళ భారీగా వర్షం పడుతున్న సమయాన్ని వారు చొరబాటుకు ఎంచుకున్నారు. ఇది గమనించిన భారత సైన్యం జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు సైతం ఎదురుకాల్పులు జరిపారు.
Read Also: Vehicles Registration in TS: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదులు గాయాలతో పడి ఉన్నారు. గాయాలతో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక మందుపాతరలకు ఉపయోగించే దాదాపు 10 కేజీల మందుగుండు సామాగ్రిని కూడా సీజ్ చేశారు. ఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత జవాన్కు ఒకరికి గాయాలయ్యాయి.