Eknath Shinde: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత వాడెట్టివార్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీలు ఇటీవల చేసిన కామెంట్స్ పై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. భారత్లో ఉంటూ పాకిస్థాన్ లాంగ్వేజ్ మాట్లాడే వారిపై దేశద్రోహం కేసు పెట్టి.. జైలుకు పంపాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో దేశమంతా వ్యాపించిన దేశ భక్తిని చూసి వారు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ (బుధవారం) షిండే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.. కొంత మంది పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మేము వదిలిపెట్టబోమని ఏక్ నాథ్ షిండే హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: India-Canada: సిక్కు వేర్పాటువాదులకు భారత రాయబారి వార్నింగ్
కాగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలిపి వేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ గాజులు తొడుక్కుని ఏం లేదని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. పాక్ గురించి ప్రశ్నించడానికి వీళ్లెవరు? పాకిస్థానీలా, హిందుస్థానీలా? దేశద్రోహులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ సుధీర్ఘ కాలం రాష్ట్రంలో, కేంద్రంలో పని చేసినా రాష్ట్రానికి మాత్రం ఏమీ చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలను ఇస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి మరో 6 వేలను కలిపి ప్రతి ఏటా రైతులకు రూ.12 వేలు ఇస్తున్నామని తెలిపారు. పంట బీమాను ఉచితంగా అందజేస్తున్నాం.. రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం.. పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ చూశారని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.