అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్ టూరిస్ట్గా తాజాగా గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నప్పటికీ.. భారత పాస్పోర్టు కలిగి ఉన్నారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. బ్లూ ఆరిజిన్ రాబోయే సంవత్సరాల్లో NASA సహకారంతో మానవులను చంద్రునిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 మిషన్లోని ఆరుగురు సిబ్బందిలో భారతీయ సంతతికి చెందిన గోపీచంద్ తోటకూర ఉన్నారు. ఎన్ఎస్-25 మిషన్కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి నల్లజాతి వ్యోమగామి. కానీ, వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసీలోకి వెళ్లే అవకాశం మాత్రం రాలేదు.
విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్పోర్టే ఉంది.
కాగా.. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ సెప్టెంబరు 2022లో రాకెట్ దుర్ఘటన అనంతరం రెండేళ్లకు తర్వాత మొదటి సారి ఆదివారం ఆకాశాన్ని తాకింది. న్యూ షెపర్డ్ రాకెట్.. క్యాప్సూల్ వెస్ట్ టెక్సాస్లోని ఒక ప్రైవేట్ ర్యాంచ్లో బ్లూ ఆరిజిన్ సౌకర్యాల నుంచి ఉదయం 9:36 (స్థానిక సమయం) గంటలకు బయలుదేరినట్లు CNN నివేదించింది. NS-25 అని పిలువబడే మిషన్ ప్రత్యక్ష ప్రసారం బ్లూ ఆరిజిన్ వెబ్సైట్లో ఉదయం 8:12 గంటలకు (స్థానిక సమయం) ప్రారంభమైంది. ప్రయోగంలో భాగంగా గమ్యస్థానం చేరాక.. రాకెట్ సిబ్బంది క్యాప్సూల్ నుంచి విడిపోయింది. వాతావరణం యొక్క సరిహద్దును దాటి 105.7 కిలోమీటర్లకు చేరుకుంది. అందులోని క్యాప్సూల్, గమ్డ్రాప్ ఆకారపు పాడ్ సిబ్బందిని మోసుకుని భూమికి తీసుకొచ్చింది. వారంతా సురక్షితంగా వచ్చారు. వారు పారాచూట్ సాయంతో భూమినికి చేరుకున్నారు. అంతకు ముందు అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడాన్ని వాళ్లు గమనించారు. సిబ్బంది తమ సీటు బెల్ట్లను విప్పి కొన్ని నిమిషాల పాటు పాడ్ చుట్టూ తేలాలని చూశారు. అంతరిక్షంలో కొత్త అనుభూతిని పొందారు.