Municipal Elections: నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దీంతో పట్టణాలలో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను భారీగా 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య ఎన్నికలపై పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైన అనంతరం మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. దీంతో పోటీకి నిలిచే అభ్యర్థుల తుది చిత్రం స్పష్టమవడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది.
READ MORE: Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..
కాగా.. కొన్ని పార్టీలు ఇంకా కొన్ని వార్డుల్లో బిఫారాలు అందించలేదు. నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల అధికారులకు బిఫారాల అందజేతకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి గడువు. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. బిఫారాలు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో బిఫారం దక్కని వారు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా స్వతంత్రులుగా పోటీలో ఉంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పలుచోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక బుజ్జగింపులు మొదలవుతాయి. రెబల్ అభ్యర్థులను తప్పించేందుకు అనేక కీలక మీటింగ్లు, హామీలతో అగ్రనేతలు బిజీ బిజీగా ఉంటారు.