YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది.. ఎంపీ అవినాష్ రెడ్డి తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు. అయితే వాదనలకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గంటల సమయం పడుతుందని న్యాయవాది బదులిచ్చారు.. దీంతో.. విచారణను రేపటికి వాయిదా వేసింది హై కోర్టు.. అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది హైకోర్టు.. ఇరు వర్గాలు వాదనలు వినిపించనున్నారు.
Read Also: Village and Ward Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం గుడ్న్యూస్..
కాగా, ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. ముందస్తు బెయిల్పై అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషనర్కు ఉందని పేర్కొంది.. అవినాష్ పిటిషన్పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తల్లి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే.. ఆస్పత్రిలోనే ఉండి.. ఆమె బాగోగులు చూసుకుంటున్నారు ఎంపీ అవినాష్రెడ్డి. మరి.. రేపు హైకోర్టులో ఎలాంటి వాదనలు జరగనున్నాయి.. తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించనుంది అనేది ఉత్కంఠగా మారిపోయింది.