Yellow and Orange Alerts Issued for Several Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ సహా జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప.. బయటికి రావొద్దని హెచ్చరించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బుధవారం (ఆగస్టు 13) నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాలో కూడా భారీగా వానలు పడనున్నాయని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యలకు సిద్ధం చేశారు.
Also Read: Asia Cup 2025: స్టార్ పేసర్ ఎంట్రీ.. ఆసియా కప్కు భారత జట్టు ఇదే!
తెలంగాణలో గత 4-5 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు పడుతున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 6.6 సెంమీ వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, వరంగల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.