Chandrababu: రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు. రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఎసీబీ సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖ పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ముందుగానే లేఖలు రాసి వివరాలు కోరారు చంద్రబాబు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాసినట్లు తెలుస్తోంది.
Read Also: AP Capital: ఏపీ రాజధానిగా వైజాగ్!.. సీఎం జగన్ సంచలన ప్రకటన
లేఖలో అంశాలు..
“గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో నాకు సమాచారం ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలి. నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలపాల్సి ఉంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నా. వ్యక్తిగతంగా నేను ప్రతి పోలీసు స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి మీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను.” అని చంద్రబాబు లేఖలో కోరారు.