Supreme Court: తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. గత ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ పై పిటిషన్ వేశారు. మహబూబ్ నగర్ వాసి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను ఇటీవల తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాఘవేందర్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రాఘవేందర్ రాజు పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. రాఘవేందర్ రాజు పిటిషన్ కు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
