NTV Telugu Site icon

Supreme Court: తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసిన నిందితుడు.. 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటన?

Supreme Court

Supreme Court

ఉరిశిక్ష పడిన వ్యక్తిని 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తన భార్య, తల్లి, రెండేళ్ల బాలికను హత్య చేశాడని ఆరోపించారు. 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలలో.. అతను 8 సంవత్సరాలు కఠిన కారాగారశిక్షను ఎదుర్కొన్నాడు. 2012లో పూణేలో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది. అతని నేరాన్ని రుజువు చేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు…
న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దిగువ కోర్టు, బాంబే హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. గతంతో ఆ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. కానీ సాక్ష్యాధారాలను పరిశీలించిన అత్యున్నతన్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించడానికి ఈ ఆధారాలు సరిపోవని తేల్చింది. కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినీ దోషులుగా తేల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

తీర్పులో కోర్టు ఏం చెప్పింది?
అనుమానం ఎంత బలంగా ఉన్నా సాక్ష్యం స్థానంలో ఉండకూడదనేది స్థిరమైన చట్టమని జస్టిస్ గవాయ్ తీర్పులో పేర్కొన్నారు. ఒక నిందితుడు దోషిగా రుజువైయ్యే వరకు అతడు నిర్దోషిగానే పరిగణించబడతాడని స్పష్టం చేశారు. పొరుగువారి వాంగ్మూలం ఆధారంగా ట్రయల్ కోర్టు, బాంబే హైకోర్టు అతన్ని దోషిగా నిర్ధారించాయి. అయితే, ఈ ప్రకటన చాలా వైరుధ్యాలతో కూడుకున్నదని, సందర్భోచిత సాక్ష్యాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసిన న్యాయమూర్తి.. 

న్యాయమూర్తి గవాయ్ మాట్లాడుతూ.. “ప్రాసిక్యూషన్ నేరాన్ని అంచనా వేయడానికి అన్ని పరిస్థితులను పూర్తిగా నిర్ధారించడం అవసరం. నిందితుడిని దోషిగా నిర్ధారించే ముందు అతడు దోషి అని రుజువు చేసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. ” అని పేర్కొన్నారు. ‘నిరూపించబడవచ్చు’ మరియు ‘తప్పక నిరూపించబడాలి’ అనే వాటి మధ్య వ్యాకరణం మాత్రమే కాదు.. చట్టబద్ధమైన తేడా కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.