Srinivas Goud : తిరుమలలో అందరినీ సమానంగా చూడాలి..!

  • తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు
  • లేఖలు తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం
  • దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని వ్యాఖ్య
Srinivas Goud

Srinivas Goud

Srinivas Goud : తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని, తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూసే విధానాన్ని గుర్తుచేశారు. తిరుమలలో కూడా ఇదే నిబద్ధత ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటారని గుర్తు చేశారు. అలాంటప్పుడు తిరుమలలో తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అంగీకరించకపోవడం భక్తుల్లో భేదాభిప్రాయాలు కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ వివక్షను ఆపి, సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీని కోరారు. దేవుడి దగ్గర అన్ని ప్రాంతాల భక్తులూ సమానమేనని, దీనిలో రాజకీయం ఉండరాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాతో ఉన్న ముఖ్యమైన సంబంధం తిరుపతితోనేనని చెప్పారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి తిరుమల శ్రీవారిని దర్శించి తలనీలాలు సమర్పించుకోవాలని అనుకుంటారని ఆయన పేర్కొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల కోసం గద్వాలలో నేసిన పట్టుచీరను సమర్పించడం ఒక చారిత్రాత్మక ఆనవాయితీగా కొనసాగుతుందని గుర్తుచేశారు.

Womens Wearing Bangles: మహిళలు గాజులు ధరించడం వల్ల ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?