ఐపీఎల్-2026 సీజన్ రణరంగం మొదలవ్వకముందే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) శిబిరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టును విజయపథంలో నడిపిస్తాడనుకున్న స్టార్ ప్లేయర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్కు వెన్నునొప్పి గాయంతో ఆయన ఈ సీజన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నారు. ఈ క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించిన మేనేజ్మెంట్, చివరకు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది.
ఆరెంజ్ ఆర్మీకి కొత్త బాస్..
మెగా వేలంలో భారీ ధరకు దక్కించుకున్న ఇషాన్ కిషన్పై ఉన్న నమ్మకంతో యాజమాన్యం అతడిని తాత్కాలిక కెప్టెన్గా ప్రకటించింది. కిషన్ దూకుడైన బ్యాటింగ్ శైలికి తోడు, వికెట్ల వెనుక ఉండి గేమ్ ప్లాన్ చేయగల సామర్థ్యం అతడికి ప్లస్ పాయింట్ కానుంది. కమిన్స్ పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించే వరకు ఇషాన్ కిషనే సన్రైజర్స్ను నడిపిస్తారు. కెప్టెన్సీ మార్పుతో పాటు వైస్ కెప్టెన్గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను నియమించడం మరో విశేషం. గత కొన్ని సీజన్లుగా ఎస్ఆర్హెచ్ తరపున అద్భుత ప్రదర్శన చేస్తున్న అభిషేక్, ఇషాన్ కిషన్కు చేదోడు వాదోడుగా ఉండనున్నారు. ఇద్దరు యువ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా జట్టులో కొత్త ఉత్సాహం నింపాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
Also Read;Kuldeep Wedding: జడేజా కాళ్లు మొక్కిన కుల్దిప్.. వీడియో వైరల్ !
కమిన్స్ పరిస్థితి ఏమిటి..?
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న పాట్ కమిన్స్, అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా అతను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కోలుకున్న వెంటనే అతను భారత్కు చేరుకుని జట్టులో చేరతారని.. అప్పటివరకు కోచ్ డేనియల్ వెట్టోరి ఆధ్వర్యంలో ఇషాన్ బృందం వ్యూహాలకు పదును పెడుతుందని సమాచారం.
Also Read:
Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల మొద్దు నిద్ర.. నగరంలో భారీగా కుళ్లిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ హలీం, అల్లం-వెల్లుల్లి పేస్ట్!
ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్తో సన్రైజర్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఆరెంజ్ ఆర్మీ ఏ మేరకు రాణిస్తుందో, తన కెప్టెన్సీ మార్కును ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుభవజ్ఞుడైన కమిన్స్ లేకపోవడం జట్టుకు లోటే అయినప్పటికీ, యువ జోడీ ఏ రకమైన మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.