Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం అని ప్రకటించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. వంటిల్లు నుంచి ప్రపంచవేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్న ఆమె.. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరని తెలిపారు.. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని కొనియాడారు.. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారు.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ అందించారని గుర్తుచేశారు.. పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లను అమలుచేసిందన్న ఆమె.. అందువల్లే ఈ రోజు దేశంలో 15 లక్షల మంది మహిళలు అధికారాన్ని దక్కించుకున్నారని తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తోందని స్పష్టం చేశారు.
సరోజిని నాయుడు, సుచేత కృపలానీ, అరుణ్ అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిత్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారంటూ స్మరించుకున్నారు సోనియా గాంధీ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నేడు లోక్సభలో పార్టీ చర్చకు నాయకత్వం వహించారు. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిన్న నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం విదితమే కాగా.. ఈ రోజు లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సాగుతోంది.. లోక్సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు కింద ఓబీసీ, ఎస్సీ కోటా డిమాండ్ చేయడంతో బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. భారతీయ మహిళల త్యాగాలు మరియు విజయాలను ప్రస్తావించిన సోనియా గాంధీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టినందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనత వహించారని గుర్తుచేశారు.
వీలైనంత త్వరగా బిల్లును అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని, మహిళా రిజర్వేషన్ బిల్లులో షెడ్యూల్డ్ కులాలు, ఓబీసీలకు తక్షణమే కుల గణన, కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు సోనియా గాంధీ.. బీజేపీకి చెందిన నిషికాంత్ దూబే ఈ డిమాండ్ను బిల్లు నుండి మళ్లించడానికి మరియు మహిళా బిల్లుకు క్రెడిట్ కొట్టే ప్రయత్నంగా అభివర్ణించారు. ఓబీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ గతంలో ఎన్నడూ మాట్లాడలేదని, రాజకీయ కోణాల కోసం ఇప్పుడు ఈ కొత్త అంశాలు తెరపైకి తెస్తున్నాయని అన్నారు.