Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం తప్పడంలేదు. దీనికి కారణం స్టేషన్ లో భారీ స్థాయిలో జరగబోయే ఆధునీకరణ పనులు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంపై విశేషంగా దృష్టి పెట్టడంతో.. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు.
ఈ ఆధునీకరణలో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను 100 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా 120 జతల రైళ్ల రూట్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా, చర్లపల్లి నుంచి ఎక్కువ రైళ్లు నడపనున్నట్లు మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్లో రెండస్తుల భారీ స్కై కాంకోర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ కాంకోర్స్లో ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలుఅంటే.. రెస్టారెంట్లు, కియోస్క్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అలా అన్ని స్కై కాంకోర్స్కు అనుసంధానంగా ఉండేలా ప్రణాళికలు చేపట్టనున్నారు.
5, 6వ ప్లాట్ఫామ్ల మధ్య 500 టన్నుల సామర్థ్యం గల భారీ హోవీ క్రేన్ ఏర్పాటు చేస్తుండడంతో.. దీనికోసం ప్లాట్ఫామ్ల మధ్య గ్యాప్ను ఇసుక బస్తాలతో నింపి, క్రేన్ సహాయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనితో మొత్తం 6 ప్లాట్ఫామ్లు తాత్కాలికంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ తాత్కాలిక అసౌకర్యం నుంచి ప్రయాణికులను తప్పించేందుకు, రైల్వే శాఖ చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రైళ్లను నడిపే ఏర్పాట్లు చేసింది.