ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్లో కలకలం రేపాయి. న్యాయవాది సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, దీనిపై మంగ్లీ ఘాటుగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ తనను ఆర్థికంగా మోసం చేసిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తాను ఎంతో కష్టపడి, అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నానని.. ఎవరినీ పైసా కూడా మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
మీడియాతో మాట్లాడే సమయంలో మంగ్లీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. “సోషల్ మీడియాలో వార్తలు ఎంత వేగంగా, ఎంత తప్పుగా ప్రచారమవుతాయో ఇప్పుడు అర్థమవుతోంది. కేవలం ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేసి ఒకరి జీవితాన్ని, గౌరవాన్ని దెబ్బతీయొద్దు’ అని ఆమె నెటిజన్లను కోరారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
