కామారెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద నుంచి గత నెల 28 నుండి ఈ రోజు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల చివరి వరకు 500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తాం షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 100కు పైగా హామీలను నెరవేర్చకుండా, బుద్ది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించిన ఆయన, గడువులోపు అమలు చేయకపోతే అప్పడు అడగండి అంటూ బీఆరెస్ కు హితవుపలికారు. రాష్ట్రంలో గడీలపాలన అంతమైంది.. ప్రజా పాలన కొనసాగుతున్నదన్నారు. అధికారం కోల్పోయామని దొరలకు నిద్రపట్టడం లేదు.. ఆ ప్రస్టేషన్ లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని బీఆరెస్ ను విమర్శించారు.