Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఒక స్కూటీపై వందలాది ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి. మొత్తం జరిమానాలను లెక్కిస్తే 3.20 లక్షల రూపాయలుగా తేలింది. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, వన్వేలో, మొబైల్లో మాట్లాడుతూ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల ఈ చలానాలు పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సుధామనగరవాసి వెంకటరామన్కు చెందిన కేఏ 05 కేఎఫ్ 7969 నంబరు కలిగిన యాక్టివా స్కూటీపై ఈ చాలన్లు ఉన్నాయి. దీనిపై దాదాపు 300కు పైగా చలానాలు ఉండగా, వాటిపై నగర ట్రాఫిక్ పోలీసులు 3.20 లక్షల రూపాయల ఫైన్ విధించారు.
Read Also: Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలు.. రేస్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా..?
దీంతో పోలీసులు వెంకటరామన్ ఇంటికి వెళ్లి జరిమానా చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అంత మొత్తం జరిమానా చెల్లించడం సాధ్యం కాదన్నారు.. కావాలంటే స్కూటీని తీసుకువెళ్లాలని వాహనదారుడు పోలీసులకు సూచించారు.. అందుకు పోలీసులు నిరాకరించడంతో.. తమకు ఈ వాహనం వద్దు, జరిమానా చెల్లించి తీరాల్సిందేనని పోలీసులు అతడికి తెలిపారు. జరిమానా చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనే ఆర్టీనగర ప్రాంతంలోని గంగానగరలో వెలుగు చూసింది. ట్రాఫిక్ రూల్స్ అత్రికమించినందుకు స్కూటీపై గతేడాది డిసెంబరులో రూ.3.22లక్షల జరిమానాను పోలీసులు విధించారు. ఆ వాహనంపై 643 చాలన్లు అతిక్రమించినట్లు పోలీసులు తెలిపారు. సదరు స్కూటీ యజమాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.