Sanjay Manjrekar Says India Bowlers Deserve for Player of the Match Award: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి.. విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాపై విజయం టీమిండియాకు అంత ఈజీగా దక్కలేదు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలవడానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే అవసరమయిన సమయంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ల అద్భుత బౌలింగ్తో భారత్ గట్టెక్కింది. ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు 59 బంతుల్లో 76 రన్స్ చేసిన విరాట్ కోహ్లీకి దక్కింది. కోహ్లీకి ఈ అవార్డు దక్కడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు విరాట్ కోహ్లీ అనర్హుడు అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. అవార్డును కోహ్లీకి బదులు బౌలర్లకు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ కారణంగా విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్యాకు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం రాలేదు. హార్దిక్ కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. భారత్ బ్యాటింగ్ బాగుంది కానీ.. కోహ్లీ నెమ్మదైన బ్యాటింగ్ వల్లే భారత్ ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కొంది. కోహ్లీని బౌలర్లే కాపాడారు’ అని అన్నాడు.
Also Read: Rohit Shama Soil: అందుకే మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
‘ఓ దశలో భారత్ ఓడిపోయే స్థితిలో నిలిచింది. అప్పుడు 90 శాతం విజయావకాశాలు దక్షిణాఫ్రికాకే ఉన్నాయి. భారత బౌలర్లు మ్యాచును మలుపుతిప్పారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను కాపాడింది బౌలర్లే. విరాట్ 128 స్ట్రైక్ రేట్తో సగం ఇన్నింగ్స్ను ఆడాడు. నా అభిప్రాయం ప్రకారం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ బౌలర్కు ఇవ్వాల్సింది. ఎందుకంటే వారే భారత జట్టును గెలిపించారు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.