NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కేసులన్నీ అక్రమమే..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనల్లో పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ ఘటన జరిగిన రోజు తాను జిల్లాలోనే లేనని, బద్వేల్‌ ఉన్నానని పేర్కొన్నారు. స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

అక్రమ కేసులతో ఎయిర్‌పోర్టులలో కూడా వైసీపీ నేతలను ఆపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలా వేధిస్తే మాలో ఇంకా పట్టుదల పెరుగుతుందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది పాలన చేయమని మాత్రమేనని, ప్రతిపక్షాలను వేధించమని కాదన్నారు. ప్రతిపక్షాన్ని వేధించడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కక్ష్య పూరిత పనులు మానుకోవాలని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.