NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని అన్నారు. ఆ రోజే వైవీ సుబ్బారెడ్డి కోర్టును కూడా ఆశ్రయించారన్నారు. చంద్రబాబు చేసిన అపచార వ్యాఖ్యలు మామూలుగా ప్రజల్లోంచి వెళ్లవన్నారు. ఆ పాపం చంద్రబాబుదే అనే నిజం ప్రజలకు తెలియాలన్నారు.అయోధ్య రామాలయం వారు కూడా ఇక్కడి విధానం నచ్చి ఇక్కడి నుంచి తీసుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. కల్తీ లేకుండా ప్రసాదాలు, భోజనాలు అందించిన చరిత్ర టీటీడీదని.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పోగొట్టే ప్రయత్నం చేశాడన్నారు.

Read Also: Margani Bharat: చంద్రబాబు శ్రీవారి లడ్డూపై పెద్ద నింద వేశారు..

షోకాజ్ నోటీస్‌లో జంతువుల కొవ్వుకు సంబంధించిన అంశం లేదన్నారు. నేషనల్ ల్యాబ్‌లు ఎవరూ కూడా ముందుకు రావడం లేదన్నారు. జంతువుల కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్టులోనూ చూపించడం లేదన్నారు. నాణ్యతా లోపం ఉన్న ఏ ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా మేము లోనికి రానివ్వలేదని ఆయన వెల్లడించారు. స్వయంగా చంద్రబాబు కొడుకు లోకేష్ కుమార్‌ ట్యాంకర్ లోనికి వెళ్లలేదు అంటున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం పదే పదే ట్యాంకర్ లోనికి వెళ్లిందని అనడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. వారి ప్రభుత్వంలో మాదిరిగానే మా ప్రభుత్వంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిన సందర్బాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రే జంతువుల కొవ్వు ఉందని ప్రస్తావించినా కూడా నోటీస్‌లో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఘోరమైన అబద్ధం ఆడారని ఆయన విమర్శించారు. యానిమల్ ఫ్యాట్ అని చెప్పినా రిపోర్ట్‌లో ఎందుకు లేదని ప్రజలందరు అడగాలన్నారు.

బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డు వివాదం వైపు మళ్లించారన్నారు. తిరుమలకు వెళ్ళడానికి పర్మిషన్ అవసరమా అంటూ ప్రశ్నించారు. డిక్లరేషన్‌పై టీటీడీ వారు మాట్లాడాలి కానీ.. ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తే బీజేపీ స్పందించడం లేదన్నారు. బీజేపీ చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి.. మాపై మాట్లాడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు పోకుండా టీటీడీకి వెళ్లకుండా ఆగిపోయారన్నారు. జగన్ వెళ్తే అక్కడ అనవసర సీన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారన్నారు. దాని వల్ల అక్కడ ఉన్న భక్తులకు ఇబ్బంది జరుగకుండా జగన్ వెళ్ళక పోవడం అభినందించాల్సిన విషయమన్నారు.

నాలుగు గోడల మధ్య అంటే వ్యక్తిగతం అని అర్థమన్నారు. అది కూడా అర్థం చేసుకోకుండా దానిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. డిక్లరేషన్ అనేది మొదటి సారి వెళ్ళినప్పుడు చేస్తారన్నారు. ఇన్ని సార్లు వెళ్ళిన తరువాత డిక్లరేషన్ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కలాం వెళ్ళినప్పుడు డిక్లరేషన్ చేసి ఉంటాడని.. కానీ సోనియా గాంధీ వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ చేయలేదన్నారు. డిక్లరేషన్‌పై కావాలనే రాజకీయం చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కేవలం జగన్ మోహన్ రెడ్డిని దెబ్బ తీసేందుకు భక్తుల మనోభావాలపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారన్నారు. సిట్ పేరుతో చంద్రబాబు ఎవరిని ఆఫీసర్లుగా పెట్టారో అందరికీ తెలుసన్నారు. సుప్రీం కోర్టు సిట్ విచారణకు ఆదేశిస్తే తన తప్పు బయట పడుతుందని ముందే చేయిస్తున్నాడని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.