మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సిడ్నీలో దుమ్మురేపారు. రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 121 రన్స్ చేశాడు. కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. రోకోలు చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. మొదటి రెండు వన్డేలలో గెలిచిన ఆసీస్ 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ఆరంభం కానుంది.
లక్ష్య ఛేదనలో భారత్కు శుభారంభం దక్కింది. శుభ్మన్ గిల్ (24), రోహిత్ శర్మ మొదటి వికెట్కు 69 రన్స్ చేశారు. మంచి ఊపుమీదున్న గిల్.. హేజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతికే రన్ తీసి అభిమానుల్లో ఆశలు నింపాడు. మొదటి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్లో మంచి రిథమ్తో ఆడాడు. రోహిత్, కోహ్లీ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 169 బంతుల్లో 168 పరుగులు జత చేశారు. రోహిత్, కోహ్లీల అద్భుత బ్యాటింగ్ను ఫాన్స్ ఎంజాయ్ చేశారు.
Also Read: Australia Women: ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు!
అంతముకుందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రెన్షా (56) హాఫ్ సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29), మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కేరీ (24)లు పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2 వికెట్స్ పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీశారు.