సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో పదేళ్ల క్రితం వచ్చిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా అంతా చూసే ఉంటారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత మురళీ మనోహర్కు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. పాత బకాయిలకు సంబంధించి ‘యాడ్ బ్యూరో’ సంస్థకు నాలుగు వారాల్లోగా రూ.2.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఇచ్చిన గడువులోపు ఈ నగదు చెల్లించకపోతే, ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. గతంలోనే ట్రయల్ కోర్టు ఆయనకు శిక్ష విధించగా, దానిని సవాలు చేస్తూ నిర్మాత హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఆయనకు ఊరట లభించకపోగా, డబ్బు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.
Also Read : Aamir Khan: అర్జిత్ ఇంటికి.. ఆమిర్ ఖాన్ వెళ్లడానికి అసలు కారణం ఇదే..
అసలు వివాదం ఏంటంటే?.. ఈ వివాదం 2014లో మొదలైంది. ‘కొచ్చడైయాన్’ సినిమా పనుల కోసం బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో సంస్థ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధిగా మురళీ మనోహర్ రుణం తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లింపులో భాగంగా ఆయన ఇచ్చిన రూ.5 కోట్ల చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. పదేళ్లుగా సాగుతున్న ఈ కేసులో తాజాగా హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది. అత్యంత భారీ బడ్జెట్తో, 3డీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా ఆర్థిక వివాదాల కారణంగా వార్తల్లో నిలిచింది.
