కోనసీమ జిల్లా పేరు మార్పుతో రగడ జరుగుతోంది. దీంతో అమలాపురం అట్టుడుకుతోంది. అయితే అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వ్యక్తి అన్యం సాయి అని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడు గతంలో కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు వివరిస్తున్నారు.
అయితే అన్యం సాయి వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అతడు గతంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఫోటోలు దిగాడని.. విశ్వరూప్కు మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా ఫ్లెక్సీలు కూడా కట్టాడని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
Sajjala: అమలాపురం విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్..!
అటు రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తి సీఎం అయినప్పుడు.. కోనసీమ జిల్లా పేరు విషయంలోనూ ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారో అదే చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు. అంబేద్కర్ను అభిమానించని వ్యక్తి ఏ కులంలో కూడా ఉండరని.. అన్ని కులాల వారు ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. జిల్లా పేరు విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మంది ప్రజలు సమర్థిస్తున్నారనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని నిర్వహించాలని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.