Punjab Politics: రాజ్యసభ ఎంపీ, ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా ప్రధాని నరేంద్రమోడీతో శనివారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాన్ని చద్దా ‘‘చిరస్మరణీయమైన ఉదయం’’గా అభివర్ణించారు. పంజాబ్ ఎన్నికలకు ముందు బీజేపీ చద్దాకు కీలక బాధ్యతలు అప్పగించబోతుందా.? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోడీతో భేటీ అయిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే, ఏ అంశాలపై మాట్లాడుకున్నారనే విషయాన్ని చద్దా వెల్లడించలేదు.
చద్దా, బాదల్తో మోడీ భేటీలకు ప్రాధాన్యత..
పంజాబ్ ఎన్నికలకు ముందు చద్దా, మోడీతో భేటీ కావడంతో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. చద్దాకు పంజాబ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. జలంధర్తో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. చద్దాతో భేటీకి ముందు అంటే శుక్రవారం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ రెండు కీలక సమావేశాల తర్వాత పంజాబ్లో బీజేపీ కీలక వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆప్ పంజాబ్లో అధికారంలో ఉంది. రైతుల ఉద్యమం కారణంగా అకాలీదళ్తో బీజేపీకి ఉన్న 25 ఏళ్ల పొత్తు చెదిరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు పార్టీలు జతకట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చద్దాకు ఎందుకు ప్రాధాన్యం:
పంజాబ్ నుంచే రాజ్యసభకు చద్దా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఆ రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అమృత్సర్, లుధియానా, జలంధర్ వంటి ప్రధాన నగరాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడానికి చద్దా ఉపయోగపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.పంజాబ్లో వ్యాపార వర్గాలు, పట్టణ మధ్యతరగతి ఓటర్లలో పట్టు పెంచుకోవడానికి చద్దా ఉపయోగపడుతాడని బీజేపీ భావిస్తోంది.

