Vladimir Putin: రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్’ (SPIEF) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశాన్ని శాంక్షన్ల (ఆర్థిక ఆంక్షలు) పేరుతో భయపెట్టాలని లేదా ఒత్తిడికి గురిచేయాలని ఏ దేశమైనా ప్రయత్నిస్తే.. అది ఆ దేశాలకే “బూమరాంగ్” అవుతుందని (అంటే తిరగబడుతుందని) ఆయన హెచ్చరించారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో తమకు నచ్చిన భాగస్వాములను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ సార్వభౌమ దేశాలకు ఉంటుందని వివరించారు. భారత్ తీసుకునే స్వతంత్ర నిర్ణయాలకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటుందని, రష్యాతో ఉన్న సంబంధాల విషయంలో బాహ్య శక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగబోదని పుతిన్ అన్నారు.
రష్యాతో ఉన్న వ్యూహాత్మక బంధం కారణంగా అమెరికా వంటి దేశాల నుంచి భారత్ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నకు పుతిన్ బదులిస్తూ.. “భారత్ ఎప్పుడూ ఒక సార్వభౌమ దేశంగానే వ్యవహరిస్తుంది. మోడీ నాయకత్వంలో ఆంక్షల ముప్పులన్నీ వెంటనే తిప్పికొట్టబడతాయి. ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే, భారత్ ఎప్పుడూ తన సొంత పంథాలోనే నడుస్తుంది” అని వ్యాఖ్యానించారు. తమ సైన్యానికి ఏది అవసరమో, ఏది అత్యంత ఆధునికమైనదో దానినే భారత్ ఎంచుకుంటుంది తప్ప రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గదని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా గతంలో ఇరుదేశాల మధ్య జరగాల్సిన సుఖోయ్ ‘Su-57’ యుద్ధ విమాన ఉమ్మడి ప్రాజెక్టును పుతిన్ గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఐదో తరం (5th Generation) యుద్ధ విమానమైన Su-57ను కలిసి తయారు చేద్దామని తాము గతంలో భారత్కు ప్రతిపాదించామని, కొన్ని కారణాల వల్ల ఆ జాయింట్ ప్రోగ్రామ్ సాకారం కాలేదని వివరించారు. అయినప్పటికీ రష్యా సొంతంగా ఈ అత్యాధునిక విమానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిందని, ప్రస్తుతం దీనిని భారత్కు విక్రయించడానికి లేదా కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ విమానం రక్షణ రంగంలో ఎన్నో రకాలుగా, కమాండ్ అండ్ కంట్రోల్ బాధ్యతలను సైతం నిర్వహించగలదని పేర్కొన్నారు.
భారత్-రష్యా రక్షణ బంధం పరస్పర నమ్మకం వల్ల కేవలం వ్యాపారమే కాకుండా, రక్షణ రంగంలో ఉమ్మడి పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి (R&D)పై దృష్టి పెడుతున్నామని పుతిన్ చెప్పారు. దీనికి ఉదాహరణగా ఇరుదేశాల నిపుణులు కలిసి అత్యంత విజయవంతంగా రూపొందించిన ‘బ్రహ్మోస్’ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రాజెక్టును ప్రస్తావించారు. ప్రారంభం నుంచి ఈ క్షిపణి రూపకల్పనలో భారత నిపుణులు, రష్యా నిపుణులు కలిసి పనిచేశారని, అందుకే ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రక్షణ భాగస్వామ్యంగా నిలిచిందని కొనియాడారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గత అనుభవాలను పుతిన్ గుర్తుచేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధానమంత్రి కాకముందు ఒకానొక సమయంలో అమెరికా ఆయనకు వీసా నిరాకరించి, ఆంక్షలు విధించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని పుతిన్ అన్నారు. కానీ, ఈరోజు ఆయన ప్రధాని అయ్యాక ఆ ఆంక్షలన్నీ తొలగిపోయాయని, అమెరికా-భారత్ సంబంధాలు విజయవంతంగా దూసుకుపోతున్నాయని గుర్తుచేశారు. ఆనాటి చేదు అనుభవాలను మోడీ మర్చిపోయి ఉండరని తాను భావిస్తున్నట్లు చెప్తూ.. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను భారత్ ఎంత చాకచక్యంగా ఎదుర్కొంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.

